Sunday, April 28, 2024

సకల జన సంక్షేమమే ధ్యేయంగా బిఆర్‌ఎస్ మేనిఫెస్టో

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్

గోదావరిఖని: అన్ని వర్గాల వారికి మేలు కలిగించే విధంగా సకల జన సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ ఎస్ మేనిఫెస్టో ఉందని తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైైర్మన్ కోలేటి దామోదర్ ప్రశంసించారు. నూటికి నూరుశాతం ఇది పీపుల్స్ మేనిఫేస్టోగా ఆయన అభివర్ణించారు. మేనిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తుందని, సకల జన సంక్షేమంగా ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మేనిఫెస్టో తీర్చిదిద్దారని దామోదర్ పేర్కొన్నారు. ఆసరా పెన్షన్‌దారులకు – ప్రస్తుతం రూ.2 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.5 వేలకు, దివ్యాంగుల పెన్షన్ రూ 6 వేలకు. రైతుబంధు రూ.16 వేలకు పెంపు వంటితో బిఆర్‌ఎస్ పార్టీ సబ్బండ వర్గాలకు అండగా నిలుస్తుందనే విషయాన్ని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారన్నారు. అర్హులైన పేద మహిళలందరికీ ప్రతినెలా రూ. 3 వేల జీవన భృతిని అందించేందుకు సౌభాగ్య లక్ష్మీ వంటి కొత్త పథకాన్ని ప్రణాళికలో రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ మహిళల పట్ల తనకున్న గొప్ప మనసును చాటుకున్నారన్నారు.

93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరే విధంగా రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమాను అమలు చేస్తామని హామీ ఇవ్వడం చారిత్రాత్మకమని ఆయన కొనియాడారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పథకంతో కేసీఆర్ ప్రజలందరికి ఆత్మబంధువనని మరోసారి నిరూపించారని దామోదర్ వెల్లడించారు. పెరిగిపోయిన గ్యాస్ సిలిండర్ ధరలతో విలవిలలాడుతున్న సామాన్య ప్రజలకు సీఎం కేసీఆర్ ఊరటనిచ్చే విషయాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చి అర్హులైన లబ్దిదారులకు రూ.400కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తామననడం హర్షణీయమన్నారు.

ప్రతి నియోజకవర్గంలో అగ్రవర్ణాల వారి కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు, రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ, అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగింపు వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్పడం పట్ల అన్ని వర్గాల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు, జర్నలిస్టులకు ఆరోగ్య శ్రీ గరిష్ట ఇన్సూరెన్స్‌ను రూ. 15 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించిన కేసీఆర్ మరో శుభవార్తను అందించారన్నారు. రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్‌ఎస్ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇస్తూనే ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ పాలసీ అలాగే కొనసాగిస్తామనడం పేదల పక్షపాతినని రుజువు చేశారన్నారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా ప్రణాళిక రూపకల్పన చేశారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రణాళికతో విపకాల మైండ్ బ్లాంక్ అయిందంటూ ఆయన వ్యంగ్యాస్తాలు సంధించారు.

కేసీఆర్ పదేళ్ళపాలనలో చేపట్టిన ఎన్నో పథకాలకు ఐక్యరాజ్య సమితి మొదలు నీతి ఆయోగ్ వరకు ప్రశంసలు వచ్చాయని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పదేళ్ళ కేసీఆర్ ప్రస్థానం వెలుగు ప్రస్థానం మాదిరిగా కొనసాగిందని దామోదర్ కొనియాడారు. 2014, 2018 మేనిఫెస్టోల్లో చెప్పిన వాటితో పాటు చెప్పనివి కూడా అనేక అంశాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని దామోదర్ వెల్లడించారు. ఇలాంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికతో ముచ్చటగా మూడోసారి అధికార పీఠం కేసీఆర్‌దేనని తేటతెల్లమైందని ఆయన తెలిపారు. ప్రజా ప్రభంజనంతో బిఆర్‌ఎస్ విజయం ఖాయమని ఆయన పునరుద్ధాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News