జమ్మూ: జమ్మూ కశ్మీరులోని పూంచ్ జిల్లా వాస్తవాధీన రేఖ(ఎల్ఓసి) వెంబడి మంగళవారం పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో సరిహద్దు భద్రతా దళానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు మరణించారు. నవంబర్ 15న కూడా ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పులలో 9 మంది భద్రతా సిబ్బందితోసహా 15 మంది మరణించిన విషయం తెలిసిందే. బిఎస్ఎఫ్ నేడు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎల్ఓసి వెంబడి రాజౌరి సెక్టార్లో ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడిందని బిఎస్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. శత్రు సైనికుల దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోటిన్సత్ గైట్ అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి వీరమరణం పొందారని బిఎస్ఎఫ్ తెలిపింది. పూంచ్ జిల్లాలోని మేంధర్కు చెందిన టార్కుండి ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు బిఎస్ఎఫ్ తెలిపింది.