Friday, May 3, 2024

కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికాభివృద్ధి: నీతి ఆయోగ్ దిశా నిర్దేశం

- Advertisement -
- Advertisement -

కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికాభివృద్ధి
సమాఖ్య స్ఫూర్తికి అర్థం ఇదే
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాలకు ప్రధాని దిశా నిర్దేశం

Centre and States work together for India's progress: Modi

న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తేనే సమాఖ్య స్ఫూర్తికి అర్థమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ మండలి శనివారం సమావేశమైంది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రాల మధ్యే కాకుండా జిల్లాల మధ్య కూడా సమాఖ్య స్ఫూర్తి ఉండాలని సూచించారు. భారత్‌ను అత్మనిర్భర్‌గా తీర్చి దిద్దడానికి ప్రైవేటు రంగానికి పూర్తి అవకాశాలు కల్పించాలని మోడీ అన్నారు. ప్రైవేటు రంగ అభివృద్ధికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సమన్వయంతో పని చేశాయి. దీంతో వైరస్‌ను ఎదుర్కోవడంలో దేశం విజయం సాధించింది. కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు సమన్వయంతో లక్షం దిశగా నడవడమే దేశ అభివృద్ధికి పునాది. అదే సమాఖ్య స్ఫూర్తికి అర్థం. అప్పుడే ఆర్థికాభివృద్ధిని కూడా సాధించగలం. ఇదొక్కటే కాదు, రాష్ట్రాల మధ్యే కాదు, జిల్లాల మధ్య కూడా పోటీ, సహకారం ఉండాల్సిన అవసరం ఉంది’ అని మోడీ వివరించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో భారత్ విజయం సాధించిందని, ప్రపంచ దేశాల్లో తన ఖ్యాతిని ఇనుమడింప జేసుకుందని అన్నారు. వ్యవసాయ రంగం గురించి ప్రస్తావిస్తూ వంటనూనెలు లాంటి వాటిని పండించడానికి, వాటి దిగుమతులు తగ్గించడానికి కృషి చేయాలన్నారు. వంటనూనెలను దిగుమతి చేసుకోవడానికి రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం, వాస్తవానికి ఈ సొమ్ము రైతులకు వెళ్లాలి. ఈ పంటలను పండించేలా రైతులకు మార్గదర్శనం చేయడం ద్వారా ఈ లబ్ధి రైతులకు అందేలా చూడాలన్నారు.
బడ్జెట్‌పై సానుకూల స్పందన
ఈ ఏడాది బడ్జెట్‌పై దేశమంతటా సానుకూల స్పందన రావడం దేశ ప్రజల మనోభావాలకు అద్దం పడుతోందన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందాలని అనుకుంటోందని, అలాంటి సమయంలో ప్రజలు సమయాన్ని వృథా చేయాలనుకోవడం లేదని మోడీ అన్నారు. ముఖ్యంగా యువత అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రోత్సాహక పథకాలు ప్రతి ఒక్కరికీ అనేక అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. గడచిన కొన్నేళ్లలో కోట్ల మందికి బ్యాంకు ఖాతాలను కల్పించామని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఆరోగ్య సదుపాయాలను మెరుగుపర్చడంతో పేదల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. స్టార్టప్‌లను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఇ) బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అంటూ, ఆత్మనిర్భర్ భారత్ అంటే భారత్‌ను స్వయం సమృద్ధం చేయడమే కాదు, ప్రపంచ అవసరాలను కూడా తీర్చడమని చెప్పారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోవడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రధాని రాష్ట్రాలను కోరారు.
మమత, అమరిందర్ గైర్ హాజరు
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా,రాజ్‌నాథ్ సింగ్ పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటయిన లడఖ్, జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా తొలి సారి ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్ సిఎం కెప్టెన్ అమరిందర్ సింగ్‌లు మాత్రం భేటీకి దూరంగా ఉండడం గమనార్హం.

Centre and States work together for India’s progress: Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News