Monday, April 29, 2024

పేదరిక నిర్మూలన: నీతిఆయోగ్ నివేదిక

- Advertisement -
- Advertisement -

దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని గత వారం నీతిఆయోగ్ తాజా నివేదికలో ప్రకటించింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత తొమ్మిది సంవత్సరాల్లో ఏకంగా 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. 2022-23తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో పేదరికాన్ని తగ్గించామని నివేదికలో వివరించింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. ఇది మోడీ ప్రభుత్వం మరో జుమ్లా అంటూ గురువారం నాడు మీడియాతో సమావేశం పెట్టి మరి విరుచుకుపడింది. ఇది కేంద్ర ప్రభుత్వం కుట్ర అంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేంద్రంలోని మోడీ సర్కార్ సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికి, ఉచిత రేషన్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఇలాంటి గిమ్మిక్కులు చేస్తోందని విమర్శలు గుప్పించింది. 2022-23 నాటికి గత తొమ్మిది సంవత్సరాల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లో పేదరికం విశేషంగా తగ్గిందని నితీఆయోగ్ తాజాగా విడుదల చేసిననివేదికలో వివరించింది.

దేశవ్యాప్తంగా పేదరికం 2013-14 నాటికి 29.17% ఉంటే 2022-23 నాటికి 11.28 శాతానికి దిగి వచ్చింది. 17.89 శాతానికి పేదరికం తగ్గింది. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోషల్ మీడియా డిపార్టుమెంట్ హెడ్ సుప్రియా శ్రీనాతే బిజెపి సర్కార్‌పై మండిపడ్డారు. ఈ లెక్కలన్నీ తప్పులతడక. ఇప్పటి వరకు మోడీ సర్కార్ ఆడుతున్న అబద్ధాల సరసన మరో అబద్ధం వచ్చిచేరిందని, ఇది లేటెస్ట్ జుమ్లా అని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఇలానే బిజెపి అబద్ధాలువల్లే వేస్తుందని ఆమె విమర్శించారు. నీతిఆయోగ్ కూడా వాస్తవాలు దాస్తోందన్నారు. పేదరికం తగ్గిందని చెబుతున్న నీతిఆయోగ్ ఏ ప్రాతిపదికన దీనిపై అధ్యయనం చేసి పేదరికం తగ్గిందన్న అంచనాకు వచ్చిందని ప్రశ్నించారు. నీతిఆయోగ్ నివేదికలో ఇటు ప్రపంచ బ్యాంకు లేదా ఐఎంఎఫ్ ఏ ప్రాతిపదికన లెక్కించిందో ఆ ప్రాతిపదికన తాము లెక్కించి ఈ అంచనాకు వచ్చామని చెప్పలేదని సుప్రియా గుర్తుచేశారు. థర్డ్ పార్టీ స్టోరీలను నీతిఆయోగ్ ముద్రించి నివేదికగా తయారు చేసిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

కాగా నీతిఆయోగ్ పేదరికంపై సర్వే గురించి థర్డ్ పార్టీకి సర్వే చేయమని బాధ్యతలు అప్పగించింది. థర్డ్ పార్టీ ఇచ్చిన నివేదికను నీతిఆయోగ్ ముద్రించి విడుదల చేసింది. వాస్తవానికి చూస్తే ప్రభుత్వం చెప్పే లెక్కలు.. గ్రౌండ్ రియాల్టీ వేరుగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ గణాంకాలను బిజెపి ఎన్నికల్లో తమకు అనుకూలంగా వాడుకోవడానికి మాత్రమే పనికి వస్తుందంటోంది కాంగ్రెస్. నీతిఆయోగ్ సర్వేలో దేశంలో నిరుద్యోగం లేనేలేదంటోంది. వాస్తవానికి చూస్తే దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. నిత్యావసర సరకుల ధరలు చుక్కలనంటాయి. దేశంలో ఆర్థిక అసమానతలుపెరిగాయి. వేతనాలు తక్కువగా ఉన్నాయి. పేదరికం విపరీతంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ తన వాదన వినిపిస్తోంది. వాస్తవానికి చూస్తే ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించామని చెప్పి పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు ఎగ్గొట్టడానికి చేస్తున్న ప్రయత్నమని కాంగ్రెస్ చెబుతోంది.

నీతిఆయోగ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. కాబట్టి వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలుఅందవు. ఎందుకంటే వారి ఆదాయం పెరిగింది. వారికి ఇక నుంచి సబ్సిడీలు అందవు. ఉచిత రేషన్ లభించదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తున్న ఉచితాల నుంచి వారు దూరంగా కావాల్సి వస్తుందని శ్రీనాతే అన్నారు. నీతిఆయోగ్ నివేదికను అడ్డుపెట్టుకొని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆయాచితంగా లబ్ధిపొందాలనే కుట్ర దీని వెనుక దాగి ఉందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం దేశంలో పేదరికం తగ్గలేదని తమ వాదన వినిపిస్తోంది. దీనికి వారు చెబుతున్న కారణాల ఇలా ఉన్నాయి. ఒకవేళ దేశంలో ఏకంగా 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారని చెబుతున్న ప్రభుత్వం వాస్తవానికి చూస్తే దేశంలో వినియోగం ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఒకవేళ పేదరికం 11.7% తగ్గిందనుకుంటే ఇక దేశంలో పేదలు కేవలం 15 కోట్లు మంది మాత్రమే ఉన్నట్లు లెక్క.

అలాంటప్పుడు మోడీ సర్కార్ దేశంలోని 80కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తోందని ప్రశ్నిస్తోంది. ఇక నీతి ఆయోగ్ నివేదికను థర్డ్ పార్టీ ఎవ్వరు ఆమోదించడం లేదు. వాస్తవానికి ప్రపంచ బ్యాంకు లేదా ఐఎంఎఫ్‌లు పేదరికాన్ని కొలిచే ప్రమాణం ప్రకారం కొలవకుండా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రాతిపదికన కొలిచి పేదరికం నిర్మూలించామని గొప్పలు చెబుతోందని కాంగ్రెస్ పార్టీ బిజెపిపై విమర్శలు గుప్పిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ వాదన విషయానికి వస్తే యుపిఎ ప్రభుత్వ హయాంలో 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తెచ్చామని దీన్ని ప్రపంచబ్యాంకు కూడా ఆమోదించిందని గుర్తు చేసింది. అప్పుడు థర్డ్ పార్టీ గణాంకాలను ప్రపంచబ్యాంకు కూడా ఆమోదించిందని గుర్తు చేసింది. మోడీ ప్రభుత్వం మాత్రం ఈ గణాంకాలు చూపించి తమ డబ్బా తామే కొట్టుకుంటోందని ఎద్దేవా చేస్తోంది. నీతిఆయోగ్ నివేదిక ప్రకారం చూస్తే మోడీ ప్రభుత్వం అన్నీ రంగాల్లో ఘోరంగా విఫలమైందని సాక్ష్యాలతో సహా రుజువైందని చెబుతోంది.

గత పది సంవత్సరాల నుంచి పేదరికం నిర్మూలన గురించి ఆలోచించకుండా అబద్ధాలు వల్లే వేసుకుంటూ పోతోందని కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ సర్కార్‌పై ధ్వజమెత్తింది. నీతిఆయోగ్ పేదరికం నిర్మూలనకు సంబంధించి ప్రధానంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. వాటిలో ఆరోగ్యం, విద్య, పోషకాహారం, దీంతో పాటు పిల్లలు, గర్భిణిల ఆరోగ్యం, ఎంత వరకు చదువుకుంది. స్కూల్ అటెండెన్స్, వంటగ్యాస్, శానిటేసన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటి, స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలను పరిగణనలోకి తీసుకుంది. కాగా మల్టీడైమన్షల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపిఐ)ని కొలిచేందుకు మొత్తం 12 అంశాలను నీతిఆయోగ్ పరిగణనలోకి తీసుకుంటే, గ్లోబల్ ఎంపిఐ విషయానికి వస్తే 10 అంశాలను మాత్రం పరిగణనలోకి తీసుకుంటుంది. నీతి ఆయోగ్ నివేదికపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ద్వారా స్పందించారు. నివేదిక పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోత్సాహకరంగా ఉందన్నారు.

దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి బాటలో పట్టించేందుకు తమ కృషి తాజా నివేదిక ద్వారా కనిపిస్తోందన్నారు. భవిష్యత్తులో ప్రతి భారతీయుడి జీవితాలు మరింత మెరుగుపడేందుకు తాము కృషి చేస్తామని మోడీ భరోసా ఇచ్చారు. మరి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పేదరికం నిర్మూలన అంశం మోడీ సర్కార్‌కు ఎంత వరకు ఉపయోగపడుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకుంటుందో వేచిచూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News