ప.బెంగాల్ సర్కార్కు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్రంలో డిప్యుటేషన్పై విధులలో చేరేందుకు వీలుగా ముగ్గురు ఐపిఎస్ అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్రం గురువారం ఆదేశించింది. ఈ ముగ్గురు అధికారులకు ఇప్పటికే కొత్త బాధ్యతల కేటాయింపు జరిగిందని కేంద్రం తెలిపింది. ఐపిఎస్ కేడర్ నిబంధనల ప్రకారం ఏదైనా వివాదం తలెత్తినపుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వారు రావలసి ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీకి రాసిన ఒక లేఖలో తెలిపింది. ఈ ముగ్గురు ఐపిఎస్ అధికారులకు ఇప్పటికే కొత్త విధుల కేటాయింపు జరిగిందని, వీరిని వెంటనే రిలీవ్ చేయాలని ఆ లేఖలో కేంద్రం కోరింది.
బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా గత వారం పశ్చిమ బెంగాల్ను సందర్శించినపుడు ఆయన వాహనంపై జరిగిన రాళ్ల దాడికి బాధ్యులను చేస్తూ ముగ్గురు ఐపిఎస్ అధికారులను కేంద్రం డిప్యుటేషన్పై వెనక్కు రావాలని ఆదేశించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవెలప్మెంట్లో ఎస్పిగా భోలేనాథ్ పాండే, సుశస్త్ర సీమా బల్లో డిఐజిగా ప్రవీణ్ త్రిపాఠి, ఇండో-టిబెటన్ బార్డర్ ఫోర్స్లో ఐజిగా రాజీవ్ మిశ్రాను కేంద్రం నియమించింది. కేంద్రం తన లేఖ ప్రతిని పశ్చిమ బెంగాల్ డిజిపికి కూడా పంపించింది.