న్యూఢిల్లీ:కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ ప్రబలుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మంగళవారం నాటికి కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య భారత్లో 125కు చేరుకుంది. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్, టర్కీ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రాకపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. కరోనా వ్యాధి నిరోధానికి ప్రధాన ఆయుధంగా మారిన మాస్కులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరి కొన్ని కొత్త మార్గదర్శక సూత్రాలను జారీచేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించవలసిన అవసరం లేదు.
-దగ్గు, జ్వరం లేదా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్న వారు మాత్రమే మాస్కులు ధరించాలి.
-కోవిడ్-19 అనుమానిత లేదా నిర్ధారణ అయిన రోగి సంరక్షణ బాధ్యతలు చూస్తున్న వారు మాస్కులు ధరించాల్సి ఉంటుంది.
-శ్వాసకోశ సంబంధ వ్యాధి లక్షణాలు ఉన్న రోగుల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న వైద్య సిబ్బంది కూడా మాస్కులు ధరించాల్సి ఉంటుంది.
మాస్కులను ధరించే విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ఆరోగ్య శాఖ వివరించింది.
-మాస్కుల మడతలు విప్పే సమయంలో అవి కింది వైపు ఉండేలా చూసుకోవాలి.
-వాడిన ఆరుగంటల తర్వాత లేదా మాస్కు తడిగా మారిన తర్వాత దాన్ని తీసివేయాలి.
-మాస్కును ముక్కు, నోరు, చుబుకం కవర్ అయ్యేలా ధరించాలి. మాస్కుకు రెండు వైపులా గాలి దూరే సందు కూడా ఇవ్వకుండా గట్టిగా కట్టుకోవాలి.
-ఒకసారి వాడిన మాస్కులను మరోసారి ఎట్టి పరిస్థితిలో వాడరాదు. వాడిన మాస్కులను డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత మూసి ఉన్న చెత్తబుట్టలో పారెయ్యాలి.
-ధరించే సమయంలో మాస్కుల లోపలి భాగాన్ని తాకరాదు.
-తీసే సమయంలో మాస్కుల వెలుపలి భాగాన్ని తాకరాదు.
-మాస్కును మెడ మీద వేసుకుని ఉంచుకోరాదు.
-మాస్కును తొలగించిన తర్వాత చేతులను శుభ్రంగా సోపు, నీళ్లతో లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ వాష్తో కడుక్కోవాలి.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా జూన్ నెలాఖరువరకు ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను నిత్యావసర వస్తువులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.