స్టాక్హోం : రసాయన శాస్త్రంలో ఈ ఏటి నోబెల్ పురస్కారం ఇద్దరు సైంటిస్టులకు దక్కింది. పర్యావరణ హితం అయిన రీతిలో కణాల నిర్మాణానికి పరిశోధనలు నిర్వహించినందుకు ఈ ద్వయం నోబెల్ కెమిస్ట్రీలో విజేతలు అయ్యారు. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టూట్ సైంటిస్టు బెంజమిన్ లిస్ట్, స్కాట్లాండ్ సైంటిస్టు , ప్రిన్సెటన్ యూనివర్శిటీకి చెందిన డేవిడ్ డబ్లుసి మక్ మిలన్లను రసాయనిక శాస్త్ర నోబెల్కు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ సెక్రెటరీ జనరల్ గోరన్ హన్సన్ బుధవారం ప్రకటించారు.
అసిమెట్రిక్ ఆర్గనోకాటలిసిస్ పేరిట వ్యవహరించే కణాలను రూపొందించేందుకు వీరు నూతన ప్రక్రియలను ఎంచుకున్నారు. ఈ విధంగా రూపొందిన కణాల సమూహాలు ఇప్పటికే మానవాళికి ఎంతో ప్రయోజనకారి అయ్యాయని వివరించారు. ఇది తమకు విస్మయకర కానుక అయిందని విజేతలలో ఒకరైన లిస్ట్ తెలిపారు. తమకు ఈ పురస్కారం వస్తుందని అనుకోలేదన్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం పరిధిలో విజేతలకు స్వర్ణపతకం, కోటి స్వీడిష్ క్రోనర్ కరెన్సీ (దాదాపు 1.14 మిలియన్ డాలర్లు) బహుమతిగా వస్తాయి. ఈ సైంటిస్టుల ద్వయం ఈ కణ రూపకల్పన ప్రక్రియను 2000 సంవత్సరంలో రూపొందించారు.