Saturday, May 4, 2024

“పద్మ” అవార్డులు అందుకున్న చినజీయర్, కీరవాణి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం వేళ దేశం లోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్రం ప్రకటించిన “పద్మ” అవార్డుల ప్రదానోత్సవం బుధవారం సందడిగా జరిగింది. ఢిల్లీ లోని రాష్ట్రపతిభవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది మొత్తం 106 పద్మ పురస్కారాలను ప్రకటించగా, మార్చి 22న తొలి విడతలో 50 మందికి పైగా పద్మ అవార్డులు ప్రదానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం సాయంత్రం మిగిలిన వారందరికీ పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందజేసి గౌరవించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి త్రిదండి చినజీయర్ స్వామి పద్మభూషణ్ అందుకోగా, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే దివంగత నేత ములాయం సింగ్ యాదవ్‌కు కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్‌ను ఆయన తనయుడు , యూపీ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ అందుకున్నారు. అలాగే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. వీరితోపాటు మిగతా ప్రముఖులు “పద్మ” పురస్కారాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా కేంద్రం 106 పద్మ పురస్కారాలు ప్రకటించగా, అందులో ఆరుగురికి పద్మవిభూషణ్, 91 మందికి పద్మశ్రీలు దక్కాయి. ఈసారి తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం 12 పద్మ అవార్డులు వరించాయి. ఆధ్యాత్మిక రంగం నుంచి చినజీయర్ స్వామి, కమలేష్ డి. పటేల్‌లను పద్మభూషణ్ పురస్కారాలు వరించగా, ఎంఎం కీరవాణి సహా ఏపీలో ఏడుగురికి , తెలంగాణలో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 22న కొందరు రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకోగా, మిగతా ప్రముఖులంతా బుధవారం అవార్డులు స్వీకరించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి కీరవాణిరాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News