Friday, May 10, 2024

సిజెఐకి కేరళ చిన్నారి వర్ణరంజిత లేఖ

- Advertisement -
- Advertisement -

Class 5 girl writes letter to CJI Ramana over Covid

మీ ఆదేశాలతో కరోనా నుంచి
వేలాది మందిని కాపాడారని
ఐదో తరగతి విద్యార్థిని ప్రశంస
బాలికను అభినందిస్తూ లేఖ పంపిన జస్టిస్ ఎన్‌వి రమణ, రాజ్యాంగ పుస్తకం బహూకరణ

న్యూఢిల్లీ: దేశంలో పరిస్థితులు, న్యాయస్థానాల పనితీరును అవగాహన చేసుకున్న ఓ చిన్నారి భారత ప్రధాన న్యాయమూర్తి( సిజెఐ) జస్టిస్ ఎన్‌వి రమణకు అభినందనలు తెలియజేస్తూ లేఖ రాసింది. న్యాయస్థానం విధి నిర్వహణను వివరించే చిత్రాన్ని కూడా ఆ లేఖకు జత చేసింది. సమాజం పట్ల ఆమె చూపిస్తున్న శ్రద్ధను మెచ్చుకుంటూ సిజెఐ ఆమెకు లేఖ రాయడంతో పాటు భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహూకరించారు. కేరళలోని త్రిసూర్ కేంద్రీ విద్యాలయంలో అయిదో తగతి చదువుతున్న లిడ్వినా జోసెఫ్ ఈ లేఖ రాసింది. ఓ ప్రముఖ దినపత్రికలో భారత దేశంలోని ప్రధాన వార్తలను చదివానని, కరోనా వైరస్ వల్ల దేశ రాజధాని ఢిల్లీలోను, దేశంలోని మిగతా ప్రాంతాల్లో సంభవిస్తున్న మరణాలపట్ల తాను చాలా ఆందోళన చెందుతున్నానని పేర్కొంది.

కొవిడ్19 మహమ్మారిపై పోరాటంలో సామాన్యుల బాధలు, మరణాల పట్ల న్యాయస్థానం సమర్థవంతంగా స్పందిస్తున్నట్లు తనకు వార్తాపత్రికల ద్వారా తెలిసిందని పేర్కొంది. ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని ఆదేశించి ఎంతో మంది ప్రాణాలను కాపాడినందుకు తనకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని పేర్కొంది. దేశంలో ముఖ్యంగా ఢిల్లీలో కొవిడ్19 మహమ్మారిని దానికి సంబంధించిన మరణాలను తగ్గించడంలో న్యాయస్థానం సమగ్ర చర్యలు తీసుకుందని పేర్కొంది. దానికి సిజెఐ జస్టిస్ రమణకు ధన్యవాదాలు తెలిపింది. ఈ లేఖతో పాటుగా లిడ్వినా ఓ వర్ణరంజితమైన చిత్రాన్ని జత చేసింది. దీనిలో న్యాయమూర్తి తన ముందున్న బల్లపై ఉన్న కరోనా వైరస్‌ను తన చేతిలోని సుత్తితో పారదోలుతున్నట్లుగా ఉంది.

లిడ్వినా రాసిన లేఖ మే నెలలో సిజెఐ కార్యాలయానికి చేరింది. జస్టిస్ ఎన్‌వి రమణ సంతోషంతో స్పందిస్తూ ఆమెకు లేఖ రాశారు. ఆమె పంపిన లేఖ, చిత్రం తనను చాలా ఆకట్టుకున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో దేశంలోని పరిస్థితులను తెలుసుకుంటుండడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.ప్రజాసంక్షేమం పట్ల శ్రద్ధ చూపుతున్నందుకు అభినందించారు. ‘నువ్వు చాలా చురుకైన, సమాచారం స్పష్టంగా తెలిసిన, బాధ్యతాయుత పౌరురాలిగా ఎదుగుతావు. జాతి నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తావు’ అని లిడ్వినాకు రాసిన లేఖలో జస్టిస్ రమణ పేర్కొన్నారు. సర్వతోముఖ విజయం సాధించాలన్ని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. ఈ లేఖతో పాటుగా ‘భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని లిడ్వినాకు పంపించారు. ఆ పుస్తకంపై స్వదస్తూరితో ‘ విత్ బెస్ట్ విషెస్’ అని రాసి సంతకం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News