Monday, May 6, 2024

జనాభాను బట్టి పంపిణీ

- Advertisement -
- Advertisement -

జనాభా బట్టి రాష్ట్రాలకు టీకాల ఉచిత పంపిణీ
వృధా చేస్తే కేటాయింపులో కోత
కేంద్రం నూతన మార్గదర్శకాల జారీ
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కేంద్రం అందించే ఉచిత కరోనా టీకాలకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్యవ్యాక్సినేషన్ పురోగతి ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు టీకాలు ఉచితంగా అందచేస్తారు. టీకాల్లో వృధా ఎక్కువగా ఉంటే కేటాయించిన టీకాల సంఖ్యలో కోత ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 21 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా టీకా ఇస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన మరునాడే ఈ కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ సమర్ధంగా చేపడుతున్న రాష్ట్రాలకు కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలియచేసింది. టీకా లభ్యత సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి వెల్లడించాలని సూచించింది. ఈ మార్గదర్శకాలు జూన్ 21 నుంచి అమలు లోకి వస్తాయి.
మార్గదర్శకాలు ఇవీ
దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఈ టీకాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం.
టీకా పంపిణీలో ప్రాధాన్యత ఎలాగంటే

1. ఆరోగ్య కార్యకర్తలు 2.ఫ్రంట్‌లైన్ వర్కర్లు 3. 45 ఏళ్లు పైబడిన పౌరులు 4. రెండో డోసు వేయించుకోవలసిన వారు 5. 18 ఏళ్లు పైబడిన వారు.
18 ఏళ్లు పైబడిన వారిలో ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే సొంతంగా నిర్ణయించుకుని టీకా పంపిణీ షెడ్యూల్ చేపట్టాలి.
కేంద్ర ప్రభుత్వం అందించే టీకా డోసుల్లో రాష్ట్రాల్లోని జనాభా, కేసుల సంఖ్య , వ్యాక్సినేషన్‌లో వృద్ధి వంటి అంశాలను ఆధారం చేసుకుని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయిస్తాం. రాష్ట్రాల్లోని టీకా వృధా కేటాయింపులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
టీకా డోసులు గురించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారం ఇస్తాం. ఇదే విధంగా రాష్ట్రాలు కూడా ఆయా జిల్లాలు, వ్యాక్సిన్ కేంద్రాలకు ముందుగానే డోసుల వివరాలు పంపాలి. ప్రజలకు కూడా తెలియచేయాలి. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 25 శాతం నేరుగా ప్రైవేట్ ఆస్పత్రులకు విక్రయించే వీలు కల్పించాం. ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే డోసుల ధరలకు తయారీదారులు ముందుగానే ప్రకటించాలి. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరపై సేవా రుసుం గరిష్ఠంగా రూ.150 మాత్రమే తీసుకోవాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. కొవిన్ నమోదుతోపాటు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలి. కాల్‌సెంటర్లు, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా టీకా ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలి.

Centre releases new guidelines for vaccination program

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News