హైదరాబాద్: రెండేళ్లలో సంపూర్ణ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని (కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ను) అమల్లోకి తీసుకొస్తామని సిఎం కెసిఆర్ విలేకరులతో జరిగిన చిట్చాట్లో పేర్కొన్నారు. ధరణి వెబ్సైట్ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు చింతలపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మీడియాకు ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు గురించి విలేకరులు సిఎం కెసిఆర్ను ప్రశ్నించగా ఈ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక గెలుపు పెద్ద లెక్క కాదనీ, జరుగుతున్నవన్నీ అనవసరమైన పరిణామలని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా విలేకరులు ధరణికి సంబంధించిన పలు సమస్యలను సిఎం కెసిఆర్ను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు మరో 20 రోజుల సమయం పడుతుందని సిఎం కెసిఆర్ తెలిపారు. అంతలోపు ఆస్తుల నమోదు పూర్తి అవుతుందన్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి ఏవైనా టెక్నికల్ సమస్యలు తలెత్తితే అంతలోపు వాటిని కూడా పరిష్కరించుకుంటామన్నారు. ఆస్తుల నమోదులో ఆధార్కార్డు కచ్చితంగా తీసుకుంటున్నామని, ఆ కార్డు గురించి ఎక్కడా తాము డిస్ప్లే చేయబోమన్నారు. ఆస్తుల నమోదుకు సంబంధించి యజమాని వివరాలను తెలియకుండా ఉండడానికి హైడ్ చేసుకునేలా ఆప్షన్ ఉందన్నారు.
అందులో భాగంగానే ధరణి పోర్టల్లో ప్రైవేటు యజమానుల ఆస్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆ వివరాలను యజమానులు మాత్రమే యాక్సెస్ చేసే విధంగా పోర్టల్ సాఫ్ట్వేర్ను రూపొందించినట్టు ఆయన తెలిపారు. రెండేళ్లలో సంపూర్ణ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని (కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ను) తీసుకురావాలని యోచిస్తున్నామని, అందులో భాగంగా ముందు సమగ్ర భూ సర్వే చేపట్టాలని నిర్ణయించామన్నారు. సమగ్ర సర్వేలో భాగంగా ప్రతి అంగుళం భూమిని సర్వే చేయించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సర్వేకు సంబంధించిన టెండర్లను త్వరలో పిలుస్తామని ఆయన పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు.