Tuesday, April 30, 2024

పోరుబాటే

- Advertisement -
- Advertisement -

CM KCR direction for TRS MPs

రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యిపై నిరసనగళం గట్టిగా వినిపించండి

ఉభయ సభలు దద్దరిల్లేలా ధ్వజమెత్తండి
తొలిరోజు నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని నిర్ణయం
పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపిలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం
23 అంశాలతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై సమగ్ర నివేదికను ఎంపిల సమావేశంలో అందజేసిన ముఖ్యమంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై ఏ విషయంలోనూ తగ్గొద్దు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చాలా గట్టిగా నిలదీయాలని పార్టీ ఎంపీలకు టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. ఉభయ సభల్లో రాష్ట్ర ప్రజల పక్షాన తమ వాణిని మరింత బలంగా వినిపించాలన్నారు. ఎక్కడా రాజీపడొద్దన్నారు. బిజెపియేతర ప్రభుత్వాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని పూర్తిగా ఎండగట్టాలని సూచించారు. ఇందుకు నిరసనగా నేటి (సోమవారం) బడ్డెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగానికి ఎంపీలు దూరంగా ఉండాలని నిర్ణయించారు.కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లభించని కారణంగా సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తరువాయి 9లో

తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లినా నిధుల కోటాయింపుల్లో తగు ప్రాధాన్యత లభించకపోయినా పెద్దఎత్తున నిరసన గళం విప్పాలని ఎంపిలను సిఎం ఆదేశించారు. మనం లేవనెత్తిన అంశాలపై కేంద్రం దిగొచ్చేంత వరకు సభల్లోనే ఉండి పోరాటం చేయాలన్నారు. ఈ విషయంలో ఎంత దూరం వెళ్లడానికైనా సిద్దంగా ఉండాలన్నారు. ఇందుకు పార్టీ పూర్తి సహయ, సహకారాలు అందిస్తుందన్నారు. కేంద్రం ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తోందని…కేవలం బిజెపి పాలిత రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తోందని సిఎం కెసిఆర్ తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కేంద్రం చేయూత నివ్వడానికి మనస్సు రావడం లేదని సిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించేందుకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో పార్టీ ఎంపీలతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభలో ఏఏ అంశాలపై ప్రాధాన్యతగా భావించి లేవనెత్తాలనే విషయాలపై సమగ్రంగా చర్పించారు. ప్రధానంగా రాష్ట్ర హక్కులను సాధించుకోవడమే ఏకైక సాధనగా పార్టీ ఎంపీలు ఉభయ సభల్లో వ్యవహరించాలని సూచించారు.

మోడీ సర్కార్‌తో రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం శూన్యం

కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం అంటూ ఏమీలేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై ప్రభుత్వం రూపొందించిన నివేదికను ఎంపీలకు సిఎం ఇచ్చారు. రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన రాష్ట్రంగా కొనసాగుతున్న తెలంగాణ పట్ల కేంద్రం ఇంకా వివక్ష చూపుతూనే ఉందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. కేంద్రం ప్రవేశపెడుతున్న ప్రతి వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు ఎంతో ఒపిక, సహనంతో ఎదురుచూశామన్నారు. కానీ ప్రతి సంవత్సర నిరాశే మిగులుతోందన్నారు. ఇలాంటి పరిస్థితిపై ఇకపై ఉపేక్షించేది లేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి చేయూతనివ్వాలని కోరుతూ వివిధ అంశాలపై పలుమార్లు తానే స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే పలువురు రాష్ట్ర మంత్రులు స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలను సమర్పించారన్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని సిఎం కెసిఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

నిధులు..జాతీయ హోదా ఇవ్వదా!

అనేక రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం … మన రాష్ట్రానికి మాత్రం ఎందుకు ఇవ్వదన్న అంశంపై కూడా గట్టిగా సభల్లో నిలదీయాలని పార్టీ ఎంపిలకు సిఎం కెసిఆర్ సూచించారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలపై కూడా కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు రెండు విడతలుగా రావల్సిన రూ. 900 కోట్లతో పాటు గిరిజన యూనివర్సిటీ, రైల్వేకోచ్, ఐటిఐఆర్ వంటి అంశాలపై పార్లమెంట్‌లో గట్టిగా నిలదీయాలని ఎంపిలకు సిఎం హితబోధ చేసినట్లుగా తెలిసింది. అలాగే ఇండ్రస్ట్రియల్ కారిడార్ కోసం రూ.5వేల కోట్లు, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు కోసం రూ. 897.92 కోట్లు ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రానికి ఐటి శాఖ మంత్రి కెటిఆర్ లేఖ రాసిన విషయాన్ని కూడా సిఎం కెసిఆర్ ప్రస్తావించారని తెలిసింది.

రాష్ట్రంగా కొత్తగా ఏర్పాడు చేసిన జిల్లాల ప్రకారం నవోదయ పాఠశాలలను మంజూరు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఎంపిల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటి, హైదరాబాద్‌లో ఐఐఎం, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధుల కోసం కూడా పట్టుబట్టాలని సూచించారు. ఇలా మొత్తం 23 అంశాలపై పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో సిఎం కెసిఆర్ చర్చించారని తెలిసింది. అలాగే సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఆయనకు ప్రతి ఎంపికి ఒక బుక్‌లెట్ యయదించారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర సమాచారాన్ని పొందుపరచారని తెలుస్తోంది.

సమావేశంలో రాజ్యసభలో పార్టీ పక్షనేత కె.కేశవరావు, లోక్ సభలో పార్టీ పక్షనేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంత రావు, కె.ఆర్.సురేష్ రెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి.పాటిల్, పి.రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోత్ కవితా నాయక్, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, స్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సి ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News