Monday, April 29, 2024

ఆదివాసీ, బంజారా భవన్లను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

CM KCR inaugurates adivasi banjara bhavan

హైదరాబాద్: భారతదేశంలో భాగమైన తెలంగాణ, జాతి సమైక్యతను ప్రకటిస్తున్న సెప్టెంబర్ 17 వజ్రోత్సవ వేళ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభమైన మరో అద్భుతమైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశ పౌరులైన మెజారిటీ ప్రజలను నేటివరకు తమమీద ఆధారపడేలా చేస్తూ వస్తున్న పాలక వర్గాలకు గుణపాఠం నేర్పేవిధంగా గత పాలకులకు భిన్నంగా ఎన్నో ఆదర్శవంతమైన ‘ఇంక్లూజివ్’ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. మారిజినల్ సెక్షన్లుగా పిలువబడుతున్న దళిత బహుజన భారత శూద్ర జాతిని మందిలో కలుపుతున్న సువర్ణాధ్యాయం వొకటి వర్తమాన తెలంగాణ రాజకీయ పాలనారంగ యవనిక మీద లిఖించబడుతున్నది. తెలంగాణలో గిరిజన బిడ్డలైన ఆదివాసీలు, బంజారాల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్ లో కోట్లాది రూపాయల ఖర్చుతో ఆదివాసీ వీరుడు కొమురం భీం పేరుతో నిర్మించిన ఆదివాసీ భవన్ ను, సేవాలాల్ మహరాజ్ పేరుతో నిర్మించిన బంజారా భవన్ లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఇన్నేండ్లకు ఖరీదైన బంజారా హిల్స్ ’ లో నిర్మితమైన తమ ఆత్మగౌరవ భవనాలను ఆవిష్కరించిన సిఎం కెసిఆర్ కు హర్షాతిరేకాలతో చప్పట్లతో కేరింతలతో జై కెసిఆర్ నినాదాలతో తమ కృతజ్జతలను చాటుకున్నారు.

ఈ సందర్భంగా.. ఆదివాసి బంజారా జంట భవనాలవద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వందలాదిమంది గిరిజన కళాకారులు గోండు బంజారా సాంప్రదాయ నృత్యాలతో సాంస్కృతిక వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆదివాసీ భవన్ కు చేరుకున్న సిఎం కెసిఆర్ అక్కడ సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేశారు. అనంతరం ఆదీవాసీ భవనాన్ని ఆవిష్కరించారు. భవనంలో ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆ గోండు వీరునికి, తెలంగాణ సాయుధ పోరాట స్వాతంత్ర్య సమరయోధునికి జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేళ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సోదరులు తాము సంప్రదాయంగా ధరించే తలపాగాను సీఎం కేసీఆర్ కు ధరించారు. అనంతరం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఆదివాసీ, బంజారాల ఆనందోత్సాహాల మధ్య సీఎం కేసీఆర్ ఆదీవాసీ భవనాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆదివాసీ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. అనంతరం… జంట భవనాలలోని బంజారా భవన్ ను ఆవిష్కరించారు. అంతకు ముందు బంజారా భవన్ లో ఏర్పాటు చేసిన బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ కు పూజలు నిర్వహించారు. మద్దిమడుగు సంత్ సేవాలాల్ పీఠాధిపతి జయరాం గురుస్వామి ఆధ్వర్యంలో బంజారా సాంప్రదాయ ‘భోగు బండారి’ పూజలు జరిపారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బంజారాల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్నారు. ‘యాడీ బాపు రామ్ రామ్ ’ అంటూ సిఎం కెసిఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సదర్భంగా సభలోంచి హర్షధ్వానాలు మిన్నంటాయి. ఈ రెండు భవనాల ఆవిష్కరణోత్సవ సభల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ… ‘‘ ఎస్టీ సామాజికవర్గ ఆత్మీయ సమ్మేళనాలకు తండోపతండాలుగా విచ్చేసిన ఆదివాసీ, బంజారా బిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఇది భారతదేశ గిరిజన జాతి బిడ్డలకు స్ఫూర్తి కి కలిగించే సందర్భం. ఉద్యమ సమయంలో నేను ఎన్నోసార్లు చెప్పిన. మన రాజధానిలో బంజారా హిల్స్ అని ప్రాంతం ఉంటది.. కానీ, అక్కడ బంజారాలకే గజం జాగ లేదని చెప్పిన. ఆ మాటను తిరగరాస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తం తెలిసేలా చేసుకుంటున్నం,. చాలా సంతోషంగా మనం ఆదివాసీ బంజారా భవనాలను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ స్ఫూర్తి..’ అని అన్నారు.

గిరిజన జాతి నుంచి పైకెదిగిన ఉద్యోగులు నాయకులు మేధావులకు వారి భవిష్యత్తు తరాలను ముందు వరసలో నడిపే బాధ్యత వున్నదని సిఎం అభిప్రాయ పడ్డారు. ‘‘ కేవలం భవనాలను నిర్మించుకోవడమే కాదు. వాటిని సద్వినియోగం చేసుకునే దిశంగా గిరిజన మేధావి వర్గం ఉద్యోగులు ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్ర నీటిపారుదలశాఖలో పనిచేసే హరిరామ్ లాంటి అనేకమంది బంజారా బిడ్డలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములై తమ సేవలందిస్తున్నారు. వారికి నా అభినందనలు.’’ అని సిఎం అన్నారు. ‘‘ ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. వాటన్నింటినీ వేర్వేరు చోట్ల వేర్వేరుగా మాట్లాడుకుంటారు. కానీ, గిరిజన భాషను మాత్రం ప్రపంచమంతటా ఒకేవిధంగా మాట్లాడుకుంటారు. ఇదొక గొప్ప విషయం. గిరిజన బిడ్డలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా ఉంటే, మహారాష్ట్రలో బీసీలుగా, మరోచోట ఓసీలుగా ఉన్నారు. వీరందరినీ సమానంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వానికి మేం చెప్పడం జరిగింది. అలాగే, రాష్ట్రంలో పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరించుకునేందుకు ఇటీవలే కమిటీలు కూడా వేసుకోవాలని జీవో ఇచ్చినం. మీరందరూ పోడు భూముల సమస్య పరిష్కారంలో భాగస్వాములు కావాలి.’’ అని సీఎం కేసీఆర్ గిరిజనులకు పిలుపునిచ్చారు.

అదేవిధంగా సభలో పాల్గొన్న, అధికారులు, బంజారా మేధావులందరూ గిరిజన గూడేల్లో నివసిస్తున్న నిరుపేదల పేదరికాన్ని రూపుమాపడానికి ఈ భవనాల నుంచి ఆలోచనలు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. చీఫ్ సెక్రటరీ కూడా గిరిజనులంటే అభిమానం ఉన్న వ్యక్తేనని, వారు కూడా సర్వీసులో మొట్టమొదట ఐటీడీఏలో పనిచేశారని, గిరిజన సమస్యలన్నీ తెలిసిన సీఎస్ సహకారం కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండదండగా ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివాసీ, బంజారా భవన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో… మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, మాలోతు కవితా నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి. తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పీ.వీ.వాణీదేవి, పాడి కౌశిక్ రెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, దానం నాగేందర్, రేఖా నాయక్, శంకర్ నాయక్, మెచ్చా నాగేశ్వర్ రావు, రవీంద్రకుమార్ నాయక్, ఎ.జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు రాంచంద్ర నాయక్, వాల్యా నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, అనిల్ కూర్మాచలం, ఆర్.టి.ఐ కమిషనర్ శంకర్ నాయక్, జెడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ క్రిస్టినా చొంగ్తు, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, కరాటే రాజు, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News