Saturday, May 4, 2024

ధాన్యంపై దద్దరిల్లాలి

- Advertisement -
- Advertisement -

CM KCR is clear direction for TRS MPs on Paddy

కేంద్రం ద్వంద్వ విధానంపై పార్లమెంటు వేదికగా పోరాడుదాం

కేంద్రం అయోమయ, అస్పష్ట విధానం వ్యవసాయ రంగానికే ఇబ్బందికరం ఇప్పటికైనా ధాన్య సేకరణపై జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి
ద్వంద్వ వైఖరిని విడనాడాలి వరిధాన్యం సాగు విస్తీర్ణం విషయంలో కేంద్రం పూటకో మాట మాట్లాడుతూ కిరికిరి పెడుతోంది రాష్ట్రం నుంచి 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా కేవలం 60లక్షల మెట్రిక్ టన్నులనే సేకరిస్తామని అంటోంది ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో నిలదీయాలి టిఆర్‌ఎస్ ఎంపిలకు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టంగా దిశానిర్దేశం

మన తెలంగాణ/హైదరాబాద్: ఆహార ధాన్యసేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ అస్పష్ట విధానం వల్ల రాష్ట్ర రైతులతో పాటు దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యసేకరణలో ఇప్పటికేనా కేంద్రం జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకరావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, అందుకు పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు.

రాష్ట్ర రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్దమైన, ద్వంద్వ వైఖరిని విడనాడాలని ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షత జరిగిన టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్ర వరిధాన్య సేకరణలో స్పష్టత కోసం పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని రాజ్యసభ, లోక్ సభ సభ్యులకు సిఎం దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ఈ వానాకాలంలో వరిధాన్యం సేకరణ విషయంలో కేంద్రం పూటకో మాట మాట్లాడుతూ కిరికిరి పెడుతోందని తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించాల్సి ఉండగా, కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని( 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని) మాత్రమే సేకరిస్తామని కేంద్రం మల్లీ పాతపాటే పడుతున్నదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సిఎం కెసిఆర్ ఎంపిలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపించాలి

పార్లమెంట్ సమావేశాల్లో రైతుల పక్షాన టిఆర్‌ఎస్ వాణిని గట్టిగా వినిపించాలని ఎంపిలను సిఎం కెసిఆర్ కోరారు. ధాన్యం దిగుబడిలో అనతి కాలంలో రాష్ట్ర రైతు దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ వ్యవసాయ రంగానికి ఆశనిపాతంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల సేకరణ విషయంలో కేంద్రానికి ఒక జాతీయ విధానం ఉండాలని., దేశంలోని అన్ని రాష్ట్రాలకు ధాన్యం సేకరణ విషయంలో ఏకరీతి విధానాన్ని అనుసరించాలని, “ సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం” ( Uniform National FoodGrain Procurement Policy ) కోసం పార్లమెంటులో డిమాండ్ చేయాలని సిఎం కెసిఆర్ ఎంపిలను ఆదేశించారు.

కాగా సిఎం ఆదేశాలమేరకు రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ను, సిఎస్ సోమేశ్‌కుమార్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం కేంద్ర ప్రభుత్వ అధికారులను పలుమార్లు కలిసి విజ్జప్తి చేసినా, ఎటూ తేల్చక పోవడం పై టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష సమావేశం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రానున్న యాసంగి పంటకాలం ప్రారంభమైన నేపథ్యంలో, తెలంగాణ రైతులు వరినాట్లకు సిద్ధమౌతున్న పరిస్థితుల్లో వచ్చే యాసంగిలో బాయిల్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడం పై., అట్లాగే యాసంగి వరిధాన్యాన్ని ఎంత కొంటరో తేల్చి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా, ఇంకా నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానం పై సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఉభయ సభల్లో తెలంగాణ రైతులు, ప్రజల తరపున గళాన్ని వినిపించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది.

వార్షిక ధాన్యసేకరణ కేలండర్ ను విడుదల చేయాలని సిఎం కెసిఆర్ చేసిన డిమాండ్ ను అభినందిస్తూనే, ఎటూ తేల్చని కేంద్రం వైఖరిపై సిఎం కెసిఆర్ అధ్యక్షతన సమావేశం విస్మయం వ్యక్తం చేసింది. పార్లమెంటులో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ విధానం పై పోరాడాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శాసనసభా వ్యవహారాలు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష నేత కె. కేశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కెఆర్. సురేష్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్ సభ ఎంపిలు బి.బి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, బొర్లకుంట వెంకటేష్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌సి వెంకట్రామిరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేష్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News