Sunday, April 28, 2024

తల్లి తెలంగాణ ముద్దులపట్టి

- Advertisement -
- Advertisement -

Deeksha divas completed 12 years

ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదివస్@12

కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని నినదించిన ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టి సరిగ్గా నేటికి పన్నేండేళ్లు పూర్తయ్యింది.

మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ : ఆనాడు కేసీఆర్ వేసిన తొలి అడుగే మలి దశ తెలంగాణ ఉద్యమానికి నాందీ పలికి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది. అనంతరం సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను నిలిపివేస్తున్నట్లు డిసెంబర్ 23న ప్రకటించింది. దాంతో తెలంగాణ ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంది. అన్ని వర్గాల ప్రజలంతా ఏక తాటిమీదకొచ్చి కెసిఆర్‌కు అండగా నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధనకు జై కొట్టారు.

అనంతరం జరిగిన పరిణామాలతో ఎట్టకేలకు కేం ద్రం మళ్లీ దిగివచ్చి రాష్ట్ర ఏర్పాటుకు పూనుకోవడంతో 2014 ఫిబ్రవరీ 18న పార్లమెంట్ ఉభయసభల్లో తెలంగాణ బిల్లుకు ఆమో దం లభించింది. 1 మార్చి 2014న రాష్ట్రపతి గెజిట్‌కు సైతం ఆమో దం లభించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రజలంతా టిఆర్ ఎస్ పార్టీకి, కెసిఆర్ నాయకత్వానికి జై కొట్టడంతో తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రమాణస్వీకారం చేశారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రజలు టిఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు జేజేలు పలికారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నాటి నుండి నేటి వరకు పంచాయితి. జిల్లా పరిషత్, సహకార సంఘాలలో కూడ జనం గులాబీకే జై కొట్టారు.

ఉద్యమాన్ని ఉరకలెత్తించింది

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పటి వరకు జరిగిన ఉద్యమాలు ఒకెత్తు అయితే.. తరువాత ఉద్యమం స్వరూపమే మా రిపోయింది. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. ఉద్యమం ఉధృతిని పతాక స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఊరు…వాడా…పల్లె, పట్టణం, చిన్నా, పెద్ద, ముసలి అన్న తేడా లేకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం ఒక్కటే అందరి అజెండాగా మారింది.

కులాలు, మతాలు, పార్టీలు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా యా వత్ తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమించడానికి ప్రేరణ ఇచ్చింది. లాఠీలు, తూటాలు, భాష్పవాయుగోళాలు లెక్క చేయకుండా ఎంతటి నిర్బంధాన్నైనా నిలువరించే శక్తినిచ్చింది. చివరికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణను సాధించుకోవాలనే తెగింపును ఇచ్చింది.
వాస్తవానికి అరవై ఏండ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు ఇది. ఒక వ్యక్తి సంకల్పం నాలుగుకోట్ల మందిని ఆవహించి శివమెత్తించిన సందర్భం. భూమి మీద అనేక ఉద్యమాలు పుట్టి ఉండొచ్చు. కానీ గమ్యాన్ని ముద్దాడినవి అతిస్వల్పం. పీడనను.. దోపిడీని బలిదానాలతో ఎదురొడ్డి పునీతమైన చరిత్ర తెలంగాణ ఉద్యమానిది. తుఫాన్లను ఢీకొట్టి, కాలానికి ఎదురీది, అగ్నిపరీక్షలు తట్టుకుని నిలిచి గెలిచిన ఖ్యాతి ఉద్యమనేత కెసిఆర్‌ది. ఆయన సాహసమే దీక్షాదివస్.

ప్రాణాన్నే పావుగా ఒడ్డారు

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో టిఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌లో కేవలం ఇద్దరు ఎంపిల ప్రాతినిధ్యమే ఉంది. అయినప్పటికీ రెండే స్థానాలతోనే మహాపర్వతం వంటి భారత రాజకీయవ్యవస్థను ఢీకొట్టింది. తెలంగాణ జెండా ఎత్తిన రోజే భయాన్ని పాతిపెట్టిన కెసిఆర్ ఈసారి ఏకంగా కేంద్రం నుంచి తెలంగాణ ప్రకటననే కలగన్నారు. ఆ స్వప్న సాకారానికి ప్రాణాన్నే పావుగా ఒడ్డారు. సిద్దిపేటను కార్యక్షేత్రంగా ఎన్నుకుని 2009లో నవంబర్ 29న కరీంనగర్ నుంచి సిద్దిపేటలోని రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షాదివాస్ కోసం బయలుదేరిన ఆయనను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అయితే కెసిఆర్ అరెస్టు వార్తతో తెలంగాణ ప్రాంతమంతా అగ్గిమీద గుగ్గిలంగా మారింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్షింక్షిస్తూ శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్నారు. ఈ ఘటనతో తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు భగ్గుమన్నాయి. బంద్‌లతో తెలంగాణ హోరెత్తింది.

డిసెంబర్ 1న తాను లేకున్నా ఉద్యమం నడవాలి అని కెసిఆర్ ప్రకటించారు. డిసెంబర్ 2న పార్లమెంట్లో అద్వానీ ఈ దీక్షను ప్రస్తావించారు. 3న కెసిఆర్‌ను హైదరాబాద్లోని నిమ్స్‌కు తరలించారు. 4న తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే తన శవయాత్ర అని కెసిఆర్ ప్రకటించారు. 5న వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు, కాంగ్రెస్ ఎంపిలు కలిసి దీక్ష విరమించాలని కోరినా అందుకు కెసిఆర్ నిరాకరించారు. డిసెంబర్ 7న అప్పటి సిఎం రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నిపార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబర్ 8న తెలంగాణ దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు.

డిసెంబర్ 9న కాంగ్రెస్ కోర్ కమిటీలో ఐదుసార్లు సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలని చిదంబరానికి సోనియా సూచించారు. కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించామని ప్రకటన చేశారు. 11 రోజుల దీక్ష గమ్యాన్ని ముద్దాడింది. అనంతరం డిసెంబర్ 9న కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు స్పష్టమైన ప్రకటన వెలువడిన తర్వాతే కెసిఆర్ దీక్షను విరమించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు బిల్లును పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News