హైదరాబాద్: బిజెపి తీరుపై టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులపై బిజెపికి ఎందుకింత పగ అని నేతలు మండిపడుతున్నారు. వరద వచ్చినప్పుడు బిజెపి నేతలు బాధితులను పట్టించుకోలేదని, వరదలతో విలవిల్లాడిన హైదరాబాద్ కు కేంద్రం పైసా సాయం చేయలేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత అర్హులందరికీ వరద సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వరద సాయాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం హేయమైన చర్య అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బాధితులకు రూ.10వేల పరిహారం ఇస్తుంటే అక్కసుతో బిజెపి అడ్డుకుందని సిఎం ఫైర్ అయ్యారు. ఇంకా వేలాదిమందికి వరదసాయం అందాల్సిఉందన్న కెసిఆర్.. బిజెపి బాధితుల నోటికాడి ముద్దను లాగేసిందంటూ మండిపడ్డారు. అటు బిజెపికి గ్రేటర్ ప్రజలే బుద్దిచెబుతారని టిఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. వరద బాధితులకు ఇచ్చే రూ.10 వేల సాయంపై ఎస్ఇసికి ఫిర్యాదు చేసి నిలిపివేయించడం బిజెపి బురద రాజకీయాలకు నిదర్శనమని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. వరద బాధితుల పట్ల బిజెపికి ఏమాత్రం చిత్తశుద్ది ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వకపోగా పేదలకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న సాయంపై బిజెపి నేతలు రాజకీయం చేయడం దారుణమని ఆమె ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.
CM KCR Meeting With TRS Leaders Ends