హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నూరుశాతం టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సిఎం అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం కాసేపటిక్రితమే ముగిసింది. భేటీ ప్రారంభంలో పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి కెసిఆర్ నివాళులర్పించారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో భేటీ సందర్భంగా రానున్న ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కెసిఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. బిజెపి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. జిహెచ్ఎంసిలో వరద సాయం బిజెపినే ఆపేయించిందని కెసిఆర్ మండిపడ్డారు. ఎన్నికల తర్వాత మిగితవారికి సాయం చేస్తామన్నారు. ఇసికి ఫిర్యాదు చేసి బిజెపి పేదల పొట్టకొట్టిందని ముఖ్యమంత్రి తీవ్రంగా ఆరోపించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను రెండు విడుతలుగా ప్రకటిస్తామని.. మొదటి విడత ఇవాళ సాయంత్రం, రెండో విడత రేపు ప్రకటిస్తామని సిఎం తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో రూ.67వేల కోట్లతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల జాబితాను డివిజన్ల వారిగా ఇంచార్జ్ లకు అప్పగించారు.
CM KCR meeting with party leaders in telangana bhavan