Monday, May 6, 2024

తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమయ్యిందని, కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం చారిత్రక ఆనవాళ్లు రాష్ట్రంలో లభ్యంకావడం మనకు గర్వకారణమని, ఈ దిశగా చరిత్రకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు తెలిపేలా భారత జాగృతి సంస్థ ప్రచురించిన తెలంగాణ చరిత్ర పుస్తకం 5 సంపుటాలను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు.

భారత జాగృతి చరిత్ర విభాగం ఆరేళ్లుగా తెలంగాణలోని అనేక చారిత్రక ప్రదేశాలను, చరిత్రకారుడు రచయిత శ్రీరామోజు హరగోపాల్ ఆధ్వర్యంలో పలువురు చరిత్రకారులు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి సేకరించిన సమాచారాన్ని, మామిడి హరికృష్ణ, వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో పుస్తకాలకు రూపకల్పన చేశారు. చరిత్ర రచన కోసం ఆయా ప్రదేశాల్లోని శిలాజాలు, కట్టడాలు, శాసనాలు, నాణేలు, గ్రంథాలు సహా అన్ని రకాల చారిత్రక ఆధారాలను అధ్యయనం చేసినట్లు వారు సిఎంకు వివరించారు.

గత చరిత్రను అర్థం చేసుకోవడం వల్ల..
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ఆయా కాలాల్లో కొనసాగిన సామాజిక పరిస్థితులు, పరిపాలన రీతులు, నాటి దార్శనికతను అర్థం చేసుకుంటే రేపటికి మనకు దారి చూపుతాయన్నారు. గత చరిత్రను అర్థం చేసుకోవడం ద్వారా, వర్తమానాన్ని అవగాహన చేసుకుంటూ తద్వారా భవిష్యత్‌కు బాటలు వేసుకోగలమన్నారు. అనంతరం జాగృతి చరిత్ర విభాగం బాధ్యులతో పాటు సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను సిఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో చరిత్రకారుడు రచయిత శ్రీరామోజు హరగోపాల్, కవి సంపాదకులు వేముగంటి మురళీకృష్ణ, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News