హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా సెకెంట్ వేవ్ వచ్చినా తట్టుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని సిఎం పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి తగిన వ్యక్తిగత భద్రత పాటించడమే అసలైన ముందు అన్నారు. తెలంగాణలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు సంఖ్య బాగా తగ్గింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పదిశాతం లోపే ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.5 శాతం ఉంది. కోవిడ్ వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ మరణాల రేటు చాలా తగ్గిందని సిఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10వేల బెడ్స్ ఆక్సిజన్ సదుపాయంతో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని కెసిఆర్ వివరించారు. కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేస్తోంది. దీనికి ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. తప్పకుండా అందరూ మాస్క్ ధరించి తగిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ముందు ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
CM KCR Review on Corona Conditions in Telangana