Tuesday, April 30, 2024

ఎంత దూరమైనా వెళ్తాం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాం

కృష్ణ జలాల వినియోగంలో ఎపి వైఖరి తెలంగాణ రైతులకు హానికరం
నదీ జలాల్లో మన హక్కును కాపాడుకుందాం
ఎత్తిపోతల కోసం జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగిద్దాం
స్వయం పాలనలో సాగునీటి కష్టాలకు తావివ్వకూడదు
ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు, వచ్చే పార్లమెంట్ సమావేశాలు సహా అన్ని వేదికల మీద రాజీలేని పోరాటం చేద్దాం
సాగునీటిపై ప్రగతిభవన్‌లో జరిగిన సుదీర్ఘ సమీక్షా సమావేశం అనంతరం సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ఆయన పునరుద్ఘాటించారు. నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడంతో సహా, తెలంగాణ లిఫ్టులను నడిపించుకునేందుకు జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో.. ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని మరింత బలంగా వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు ఆరు గంటలకు పైగా జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న సాగునీటి వివక్ష గురించి సమావేశం లోతుగా చర్చించింది. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని ఈ సమావేశం తీర్మానించింది.

అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో ఎంతదూరమైన వెళ్లడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను నిర్ధారించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందార్భాల్లో కేంద్రాన్ని వత్తిడిచేస్తూ వస్తున్నదన్నారు. ఈ నేపధ్యంలో, కృష్ణా ట్రిబ్యునల్, కెఆర్‌ఎంబి తదితర వేదికల మీద తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందన్నారు.. రాష్ట్రం తరఫున ఎటువంటి వ్యూహాన్ని ఎత్తుగడలను అనుసరించాలనే విషయాలకు సంబంధించి సమావేశంలో చర్చించిన సిఎం కెసిఆర్ ఈ మేరకు అధికారులకు దిశనిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సిఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సిఎం ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, ఇఎన్‌సి మురళీధర్ రావు, సిఎం ఒఎస్‌డి శ్రీధర్ దేశ్ పాండే, అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

CM KCR Review on Irrigation Projects at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News