హైదరాబాద్: కరోనా వైరస్ పై భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. అసెంబ్లీలో సిఎం కరోనా మహమ్మారిపై మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. వైద్యరంగంలో నిధులు పెంచాలని కేంద్రాన్ని కోరామని సూచించారు. కరోనా భయంతోనే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని చెప్పారు. తబ్లిగ్ గురించి ఢిల్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది మేమే అన్న సిఎం 2లక్షల వలస కార్మికులను సొంత ఊళ్లకు పంపించామని గుర్తుచేశారు. కరోనా విషయంలో యావత్ ప్రపంచం గందరగోళానికి గురవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పుకొచ్చారు.
క్షేత్రస్థాయి సిబ్బంది రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఆరోగ్య శ్రీ కింద కరోనా చికిత్స అందించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రజలను కాపాడేందుకు మరో రూ.10వేల కోట్లు అయినా ఖర్చు పెడతామని సిఎం స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ అంత పటిష్టంగా ఆయుష్మాన్ భవ పథకం లేదని తెలిపారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు విపక్షాలు బురద జల్లుతున్నాయని ఫైర్ అయ్యారు. కరోనా కష్ట కాలంలో ప్రతిపక్షాలు ఇచ్చే నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని కెసిఆర్ వెల్లడించారు. నేనున్నంతకాలం ప్రజలేవరూ ఏమాత్రం ఆందోళన చెందాల్సి అవసరం లేదని భరోసా ఇచ్చారు. కోవిడ్-19 మరణాలు రేటు అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే తక్కువ ఉందని చెప్పారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కితే మాకేం వస్తుందన్న ముఖ్యమంత్రి సభలో మాకే చాలా పెద్ద గొంతు ఉందన్నారు. మీ గొంతు చిన్నబోయినందుకు మేమేం చేయాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
CM KCR Speech on Coronavirus At Telangana Assembly