Saturday, April 27, 2024

వెయ్యి కోట్లతో కోకాకోలా

- Advertisement -
- Advertisement -

47.53 ఎకరాల భూమిని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
భారీ బెవరేజేస్ ప్లాంటుతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వేస్టే వాటర్ మేనేజ్‌మెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి
పనిచేయడానికి హెచ్‌సిసిబి ఒప్పందం
హైదరాబాద్ హోటల్ తాజ్‌కృష్ణలో ఎంఒయుపై సంతకాలు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ హిందూస్తాన్ కోకాకోలా బేవరేజెస్(హెచ్‌సిసిబి) రాష్ట్రంలో సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా భారీ బేవరేజెస్ ప్లాంటు నిర్మించడంతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ అండ్ స్కిలింగ్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆ సంస్థ గురువారం ఒక ఒప్పందం చేసుకుంది. మొదటి దశలో రూ.600కోట్లతో సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెస్సింగ్ పార్క్ వద్ద రెండో ఫ్యాక్టరీ నెలకొల్పుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కోకాకోలా కంపెనీ కొత్తగా నెలకొల్పనున్న యూనిట్‌కిగానూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 47.53 ఎకరాల భూమిని కేటాయించింది. నీరు, ఘన వ్యర్థాల నిర్వహణలో సామర్థ్యాల పెంపు సహా స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు, నైపుణ్యాల నిర్మాణానికిగానూ రాష్ట్ర ప్రభుత్వంతో హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ ఒప్పందం చేసుకుంది.ఈ మేరకు హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృ ష్ణలో జరిగిన ఎంఒయు కార్యక్రమంలో హిందూస్థాన్ కోకా కోలా బేవరేజెస్ చైర్మన్, సిఇఒ నీరజ్ గార్గ్, బాట్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జువాన్ పాబ్లో రోడ్రిగో, రాష్ట్ర ఐటి పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్, ఆ విభాగం ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌లు పాల్గొన్నారు. కెటిఆర్ మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా తిమ్మాపూర్ సమీపంలో కోకాకోలా సంస్థ భారీ ప్లాంటును ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు.

ఈ సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదన్నారు. 25ఏండ్లుగా మంచి సేవలందిస్తోందన్నారు. మొదటి దశలో రూ.600కోట్లతో ప్లాంట్ నిర్మాణం చేపట్టి, రెండో దశలో రూ.400 కోట్లతో ప్లాంట్‌ను విస్తరిస్తారని తెలిపారు. కొత్తగా రానున ఈ ప్లాంటు వల్ల సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇందులో మహిళలకు 50శాతానికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు. ప్రధానంగా జగిత్యాలలో ఉన్న మామిడి పండ్లు, నల్గొండ దగ్గరున్న నిమ్మ ఉత్పత్తులు ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపాందించుకోవాలంటూ హెచ్‌సిసిబి ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రస్తుతం ప్లా స్టిక్ వ్యర్థాలు సమస్యగా మారాయన్నారు. పర్యావరణహితమైన వాటిని వినియోగించాలని సంస్థను కోరుతున్నామన్నారు. ప్యాకేజింగ్ రంగంలోనూ హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు తెలంగాణ కేంద్రం అవుతోందని కెటిఆర్ స్పష్టం చేశారు. కోకాకోలాతో ప్రభుత్వం మూడు ఒప్పందాలుకు దుర్చుకుందని…. రానున్న రోజుల్లో ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సంస్థకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామన్నారు.

Coca-Cola to invest Rs 1000 crore investment in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News