శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుప్వార జిల్లాలోని హంద్వారా పట్టణంలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. చంజ్ముల్లాలో ఉగ్రవాదులు దాగివున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు, పోలీసులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఓ ఇంటిలోకి ప్రవేశించి, అందులోని వారిని బంధీంచారు. దీంతో వారిని విడిపించేందుకు సైనికులు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఎనిమిది గంటలపాటు జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్లో కల్నల్ అశుతోష్, మేజర్ లతోపాటు మరో ఇద్దరు సైనికులు, ఓ కాశ్మీర్ ఎస్ఐ వీరమరణం పొందారు. ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్పై తాజాగా రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర మనస్తాపాన్ని కలిగించినట్లు ఆయన తెలిపారు. దేశ సేవ కోసం ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు నివాళ్లు అర్పిస్తున్నానన్నారు. వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపిన రాజ్నాథ్.. అమర సైనికుల కుటుంబాలకు భారత్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Colonel, Major among 5 killed in encounter in Handwara