Monday, April 29, 2024

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సిఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

న్యాయం చేయాలని ‘శరణు’
మనతెలంగాణ/హైదరాబాద్:  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై హైదరాబాద్ వ్యాపార వేత్త శరణ్ చౌదరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్నపుడు తనను అక్రమంగా నిర్బంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు పేర తన ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. దాంతోపాటు రూ.50 లక్షల నగదును తీసుకున్నారంటూ సిఎం రేవంత్ రెడ్డికి ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. 2023, ఆగష్టు 21వ తేదీన తాను ఆఫీస్‌కు వెళ్తుండగా కొందరు సివిల్ దుస్తుల్లో వచ్చి తనను అడ్డుకుని తాము పోలీసులమని చెప్పి సిసిఎస్‌కు తీసుకెళ్లారని, అక్కడకు వెళ్లిన తర్వాత పలువురి నుంచి అక్రమంగా డిపాజిట్‌లు సేకరించినట్టు తనపై కేసు పెట్టినట్లు ఏసిపి ఉమామహేశ్వర్ రావు బెదిరించారని, అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, డిసిపి రాధా కిషన్ రావు సూచనల మేరకు తనను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి కొట్టారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బలవంతంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు విజయ్ పేరు మీద తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, రెండు రోజులపాటు తనను అక్రమంగా నిర్భంధించి తన కుటుంబ సభ్యులను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించారని, తన స్నేహితుడు రూ.50 లక్షలు ఇచ్చిన తర్వాత తనను వదిలి పెట్టారని ఆయన తెలిపారు. దీనిపై తాను హైకోర్టులో రిట్ పిటీషన్ వెయ్యగా ఏపిసి ఉమా మహేశ్వర్‌రావు పోలీసులను తన వద్దకు పంపి బెదిరించి పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేశారని శరణ్ చౌదరి సిఎంకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దీనిపై పూర్తి విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని సిఎం రేవంత్ రెడ్డిని శరణ్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News