అధికార బిజెపికి షాక్..
వార్డులవారిగా చూస్తే 3వ స్థానం
బళ్లారి హస్తగతం బీదర్లో హంగ్
పిసిసి నేత డికె హర్షం ..
బెంగళూరు : కర్నాటకలో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించింది. అధికార బిజెపికి షాక్ తగిలింది. మొత్తం పది పట్టణ స్థానిక సంస్థలకు (యుఎల్బి) జరిగిన ఎన్నికలలో ఏడింటిలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ఈ పరిణామంపై కర్నాటక పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. బిజెపికి ఈ ఎన్నికలలో ఒక్కచోటనే ఆధిక్యత దక్కింది. రాష్ట్ర ప్రజలు తిరిగి కాంగ్రెస్ పట్ల విశ్వాసం ప్రకటిస్తున్నారనే విషయం ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టం అయిందని శివకుమార్ తెలిపారు. రాష్ట్రంలోని బిజెపి దుష్పరిపాలనపై ప్రజలు విసుగుచెందుతున్నారని, మొత్తం మీద కాంగ్రెస్కు 119 స్థానాలు దక్కాయని,బిజెపికి 56,జెడిఎస్కు 67 స్థానాలు వచ్చాయని డికె తెలిపారు.
ప్రస్తుత జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిలో కర్నాటక కాంగ్రెస్ కార్యకర్తలు , నేతలు విజయోత్సవాలకుదిగరాదని, ప్రజలకు ఈ కష్టకాలంలో మరింత చేదోడువాదోడుగా ఉంటూ వారి అభిమానాన్ని పదిలపర్చుకోవాలని తెలిపారు. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కాంగ్రెస్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత నెల 27వ తేదీన ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభలకు మొత్తం ఎన్నికలు బిజెపి, జెడిఎస్ల కన్నా కాంగ్రెస్ సత్ఫలితాలు రాబట్టుకుంది. కీలకమైన బళ్లారి కార్పొరేషన్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీదర్లో హంగ్ ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పెద్ద పార్టీగా నిలిచింది. ఇక్కడి వార్డులలో రెండు స్థానాలను ఎంఐఎం గెల్చుకుంది.