యాదాద్రి: కాంగ్రెస్ నేతలు నియంత్రిత సాగు విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు వ్యతిరేకులుగా మారారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. యాదాద్రిభువనగిరి కలెక్టరేట్లో నియంత్రిత సాగుపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షలు జరిపిన సందర్భంగా మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్, నీళ్లు, ఆర్థిక చేయూత, ఎరువులు, విత్తనాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. రైతులను ఏకం చేసేందుకు సిఎం కెసిఆర్ నియంత్రిత సాగు విధానం తీసుకొచ్చారని కొనియాడారు. తెలంగాణలో సమశీతోష్ణస్థితి కారణంగా సారవంతమైన నేలలున్నాయన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేసేలా తెలంగాణలో రైతులందరినీ సమాయత్తం చేస్తున్నామన్నారు. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపి లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంఎల్ఎ పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి, పాల్గొన్నారు.