న్యూఢిల్లీ : ఎవరైనా వ్యక్తిపై దోషిగా నిర్థారితుడై, స్టే పొందకపోతే అటువంటి వ్యక్తి ఎన్నికలలో పోటీకి అనర్హుడు అవుతాడు. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టు నిర్థిష్టమైన రూలింగ్ వెలువరించింది. ఏదేనీ క్రిమినల్ కేసు ఉండి, రెండేళ్లు అంతకు మించిన కాలం జైలు శిక్ష ప్రకటించి ఉంటే, ఈ శిక్షపై స్టే వెలువడకపోతే ఎన్నికల చట్టం పరిధిలో ఎన్నికలలో పోటీకి అనర్హుడు అవుతారు. కేరళలోని ఎర్నాకులం లోక్సభ స్థానం నుంచి పోటీకి తన నామినేషన్ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ స్థానిక వాసి సరిత ఎన్ నాయర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కేరళను కుదిపేసిన సోలార్ స్కామ్లో నిందితురాలైన ఆమెకు రెండు క్రిమినల్ కేసులలో దోషిగా ప్రకటించి శిక్ష విధించారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం శిక్ష ప్రకటితం అయి, దీనిపై స్టే రాకుంటే ఎన్నికలలో పోటీకి వీలులేదని పేర్కొంటూ రిటర్నింగ్ అధికారి నామినేషన్ తోసిపుచ్చారు. ఈ స్థానంలో ఆమె పోటీకి వీల్లేకుండా పోయింది. నాయరే వయనాడ్లో రాహుల్ గాంధీపై పోటీకి సిద్ధం అయ్యారు. అయితే అప్పుడు కూడా నామినేషన్ ఇవే కారణాలతో తిరస్కరించారు. దీనిపై కూడా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమెపై విచారణ జరుగుతున్నందున నామినేషన్ తిరస్కరణ సబబే అని పేర్కొంటూ గత నెల రెండవ తేదీన సుప్రీంకోర్టు ఆమె పిటిషన్ను కొట్టివేసింది.