టిపిసిసి నూతన సారథి ఎంపిక ప్రక్రియ షురూ…
గాంధీభవన్లో కాంగ్రెస్ కోర్ కమిటీ కీలక సమావేశం నిర్వహణ
మన తెలంగాణ/హైదరాబాద్: గాంధీభవన్లో కాంగ్రెస్ కోర్కమిటీ కీలక భేటీ బుధవారం సాయంత్రం కొనసాగింది. సమావేశానికి టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంఎల్ఎలు, ఎంపీలు హాజరయ్యారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి, టిపిసిసి అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేసిన నేపథ్యలో ఈ కోర్ కమిటీ సమావేశానికి అత్యధిక ప్రాధాన్యతేర్పడింది. సమావేశంలో పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. టిపిసిసి నూతన సారథి ఎంపికపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగింది. సమావేశానికి పార్టీ సీనియర్ నేత జానారెడ్డి.. ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వచ్చారు. కోర్ కమిటీ భేటీకి హాజరవ్వాలంటూ మాణికం ఠాగూర్ నుంచి తనకెలాంటి ఫోన్ రాలేదని పేర్కొంటూనే గాంధీభవన్ నుంచి మాత్రమే సమాచారం వచ్చిందని జానారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు టిపిసిసి అధ్యక్ష పదవికి ఎంపి రేవంత్రెడ్డిని ఎంపిక చేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్కమిటీ సమావేశం అత్యంత వాడీగా, వేడీగా టిపిసిసి నూతన సారథి ఎంపికపై చర్చ కొనసాగుతోంది. ఏది ఏమైనా ఈ కోర్కమిటీలో సమన్వయం సాధించే దిశగా మాణికం ఠాగూర్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.
Congress Core Committee meeting at Gandhi Bhavan