Sunday, May 12, 2024

ఫోర్త్‌వేవ్ అవకాశాలు తక్కువే

- Advertisement -
- Advertisement -

కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలి
అందరూ విధిగా మాస్కులు ధరించాలి రాష్ట్ర ప్రజారోగ్య
సంచాలకులు జి. శ్రీనివాసరావు

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో గానీ, రాష్ట్రంలో గాని ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు అతి స్వల్పంగానే ఉండే అవకాశం ఉందని అన్నారు. వ్యాక్సినేషన్ కవరేజీ దాదాపు 100 శాతం పూర్తి కావడం వల్ల ఎక్కువ మందిలో ఇమ్యూనిటీ తీసుకురాగలిగామని చెప్పారు. ఇప్పుడు కేసులు కొంచెం పెరుగుతున్నా ..ఫోర్త్ వేవ్‌కు కారణం కాకపోవచ్చని అన్నారు. మే నెల నుంచి ఇప్పటివరకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 2 కేసులే దాదాపు 65 శాతం నమోదయ్యాయని, గత రెండు రోజుల నుంచి బీఏ 4, బీఏ 5 వేరియంట్లకు సంబంధించిన కేసులు పెరుగుదల చూస్తున్నామని తెలిపారు. ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని ..ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని డీహెచ్ సూచించారు.

రాష్ట్రంలో గత వారం 355 కేసులు నమోదు కాగా .. ఈ వారం 555 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దాదాపు 56 శాతం పైగా కేసులు పెరిగాయని చెప్పారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 36 వేలకు పైగా ఉండగా .. తెలంగాణలో 811 మంది యాక్టివ్ కేసులు ఉన్నారు. థర్డ్ వేవ్ ఒమిక్రాన్ కేసులు భారీగా వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టి .. మళ్లీ గత రెండు వారాలుగా కొత్త కేసుల పెరుగుదలను చూస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా .. ఆస్పత్రిలో చేరికలు, మరణాలు దాదాపు సున్నాగానే ఉన్నాయని అన్నారు. తెలంగాణలో 811 క్రియాశీల కేసులు ఉంటే .. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం కేవలం రెండు మూడు మాత్రమే ఉన్నాయని తెలిపారు. గత రెండు నెలల నుంచి మరణాలు కూడా సున్నాగానే కొనసాగుతున్నాయని చెప్పారు. గత మూడు రోజుల నుంచి 100కు పైగా కేసులు వస్తున్నాయని, రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు రావడం చూస్తున్నామని డీహెచ్ వివరించారు.

కరోనా ఇంకా పోలేదు .. మనతోనే ఉంది

కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని, మనతో పాటే ఉందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇది పూర్తిగా నిర్మూలన అయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పారు. పాండమిక్‌గా మొదలైన ఈ మహమ్మారి .. ప్రస్తుతం ఎండమిక్ స్టేజిలో కొనసాగుతోందని వివరించారు. ఈ డిసెంబర్ నాటికి లేదా వచ్చే ఏడాది మధ్య కల్లా పూర్తిగా ఎండమిక్ స్థాయికి చేరే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించారు. ఇప్పుడు మాత్రం ఇంకో ఆర్నెళ్ల పాటు ఇలాంటి కేసుల పెరుగుదల అప్పుడప్పుడూ చూస్తుంటామని అన్నారు. ఇలా కేసులు పెరగడాన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు అస్త్రంగా ఉన్న మాస్క్‌ను ధరించాలని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణాలో ప్రయాణించేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మరిచిపోవద్దని అన్నారు. వర్షాకాలం పూ సీజన్ కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు మీ నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.

పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించడం అత్యంత అవసరం

పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించడం అత్యంత అవసరమని డీహెచ్ వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ఈ వయస్సు పిల్లలకు దాదాపు 90 శాతం మేరకు టీకా ఇచ్చామని తెలిపారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించని పిల్లలకు తల్లిదండ్రులు విధిగా వ్యాక్సిన్ వేయించాలని పేర్కొన్నారు. త్వరలోనే పాఠశాలలు తెరుచుకోనుండటంతో పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలందరికీ టీకాలు వేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని డీహెచ్ సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పిల్లలకు వాక్సినేషన్ ప్రక్రియ కొంత నెమ్మదించిందని, విద్యాసంస్థలు వాక్సినేషన్ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. కోరితే ప్రత్యేక క్యాంపులు స్కూళ్ల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. టీచర్లు ప్రికాషనరీ డోసు వేయించుకోవాలని సూచించారు. ఈ నెల 3 నుంచి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలం సమీపిస్తుండడంతో..సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల పెరుగుదలకు అవకాశం లేకుండా చూసుకోవాలని సూచించారు. 2019లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని గుర్తు చేశారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలుబు, జ్వరం, పొడి దగ్గు లక్షణాలుంటే… వెంటనే రెండు మూడు రోజులపాటు ఐసోలేట్ అయి కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని కోరారు. పాజిటివ్ అని నిర్ధారణ అయితే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News