కరీంనగర్ క్రైం ః వారిది అన్యోన్యమైన కాపురం… పెళ్ళి జరిగిన నాటి నుండి ఏ రోజు కూడా ఆ భార్యాభర్తల మధ్యన గొడవలు జరగలేదు… చూస్తుండగానే సంవత్సరకాలం పూర్తవుతుంది… మరికొద్దిసేపట్లో మొదటి సంవత్సరం వివాహ వేడుకలను జరుపుకోవాలని తలంచిన ఆ జంట దైవ దర్శనం కోసం ద్విచక్ర వాహనం మీద బయలుదేరింది… రాత్రి అందాజు సమయం 11.45 నిమిషాలు కావస్తుంది… పురుగు రూపంలో మృత్యువు ఆ జంటను విడదీసింది… ప్రమాదవశాత్తు మోటార్సైకిల్ తోసహా కాలువలో పడిన భార్యాభర్తల్లో భర్త ప్రాణాలతో బయటపడగా భార్య మాత్రం కనిపించని తీరాలకు చేరుకుంది.
గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పరాంకుశం వెంటనారాయణప్రదీప్ వివాహం చొప్పదండికి చెందిన కీర్తనతో సంవత్సరం క్రితం జరిగింది. హైదరాబాద్లోని ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటనారాయణప్రదీప్ సోమవారం రోజు తన పెళ్ళిరోజు వేడుకలను జరుపుకునేందుకు కరీంనగర్లో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు భార్యతో సహా వచ్చారు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి తిమ్మాపూర్ మండలంలోని ఎల్.ఎం.డికాలనీలో గల తపాల లక్ష్మినర్సింహాస్వామి దేవాలయానికి దర్శనం కోసం భార్య కీర్తనతో కలిసి మోటార్సైకిల్ మీద బయలుదేరారు. మార్గమధ్యంలో అల్గునూరు శివారులోని కాకతీయ కాలువ వద్దకు చేరుకోగానే కంటి పురుగు ఒకటి ప్రదీప్ కళ్ళలో పడగానే ఆయన కంగారుగా మోటార్సైకిల్ను పక్కకు తిప్పారు. దీంతో భార్యాభర్తలు ఇరువురు మోటార్సైకిల్తో సహా కెనాల్లో పడిపోయారు. తాము కెనాల్ పడిపోయిన విషయాన్ని గ్రహించిన ప్రదీప్ హెల్ప్మీ హెల్ప్మీ అంటూ కేకలు వేయడంతో అదే ప్రాంతం నుండి ఎల్.ఎం.డి పోలీస్స్టేషన్కు చెందిన బ్లూకోల్ట్ సిబ్బంది సత్యనారాయణ, శ్రీనివాస్ సహా ఎ.ఎస్.ఐ రఘుపతిరెడ్డి, కానిస్టేబుల్లు జనార్ధన్, రవి మరో పౌరుడు విల్సన్లు కలిసి నీటిలో కొట్టుకుపోతున్న ప్రదీప్ను తాళ్ళ సహాయంతో రక్షించారు.
అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వెంకటనారాయణప్రదీప్ను ఆసుపత్రికి తరలించారు. అయితే నీటి ఉధృతికి అప్పటికే కొట్టుకుపోయిన కీర్తన మృతదేహన్ని మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి వద్ద కాలువలో సోమవారం రోజు గుర్తించారు. పెళ్ళి రోజు జరగాల్సిన రోజున చావురోజును జరుపుకోవాల్సి వస్తుందని ఆ కుటుంబసభ్యులు రోధించడం అందరిని కలిచివేసింది.