లండన్: మహాత్మాగాంధీ విగ్రహంతోపాటు నెల్సన్ మండేలా, విన్స్టన్ చర్చిల్ విగ్రహాల రక్షణకు బ్రిటీష్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లండన్లోని పార్లమెంట్ సేర్లో ఉన్న ఈ విగ్రహాలకు ముసుగులు కప్పి రక్షణ ఏర్పాట్లు చేశారు. బ్రిటీష్ పాలకులతో పోరాడేందుకు అహింసాయుత మార్గాన్ని ఎంచుకున్నందుకు గాంధీ పట్ల ఆ దేశంలోనూ గౌరవ భావం ఉన్నది. ఇక చర్చిల్ రెండో ప్రపంచ యుద్ధంలో ఆ దేశ ప్రధానిగా కీలక పాత్ర వహించారన్న గౌరవం ఉన్నది.
నెల్సన్ మండేలా జాతి వివక్షకు వ్యతిరేకంగా శాంతియుత పోరాట మార్గాన్ని ఎంచుకున్నందుకు ఆయన పట్లా బ్రిటీష్ పౌరుల్లో గౌరవ భావం ఉన్నది. మే 25న అమెరికాలో తెల్ల పోలీస్ అధికారి చేతిలో జార్జ్ఫ్లాయిడ్ అవమానకరంగా దాడికి గురై మృతి చెందడంతో నల్ల జాతీయులు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. అమెరికాలో జరిగిన ఆందోళనలో గాంధీ విగ్రహంపైనా దాడి జరగడంతో బ్రిటన్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నల్లజాతీయుల ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని..అయితే, తమ దేశంతోపాటు యావత్ యూరప్ను రక్షించిన వ్యక్తిగా పేరున్న చర్చిల్ విగ్రహానికి ప్రమాదం వాటిల్లడాన్ని అనుమతించబోమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు.