దుబాయి: కరోనా వల్ల కలవరానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊరట లభించింది. కరోనా బారిన పడిన క్రికెటర్లు తప్ప మిగతావారు సాధన చేసుకునేందుకు అనుమతి లభించింది. మంగళవారం జట్టు సభ్యులకు నిర్వహించిన తాజా కరోనా పరీక్షల్లో అందరికి నెగెటివ్ వచ్చింది. అయితే కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయిన 13 మందికి మాత్రం కరోనా పరీక్షలు నిర్వహించలేదు. 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాతే వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అప్పటి వరకు ఇద్దరు క్రికెటర్లతో పాటు 11 మంది సహాయక సిబ్బంది క్వారంటైన్లోనే ఉండాల్సి ఉంటుంది. వీరికి రెండు వారాల తర్వాత కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వస్తేనే వీరికి ఐపిఎల్లో అనుమతి ఇస్తారు. ఇదిలావుండగా ఐపిఎల్ కోసం యుఎఇకి వచ్చిన చెన్నై జట్టులో కరోనా కల్లోలం సృష్టించింది. ఆరు రోజుల క్వారంటైన్ అనంతరం నిర్వహించిన పరీక్షల్లో 13 మందికి కరోనా ఉన్నట్టు తేలింది. ఇందులో ఇద్దరు క్రికెటర్లతో పాటు మరో 11 మంది సహాయక సిబ్బంది ఉన్నారు. ఇలాంటి సమయంలో చెన్నైకి ప్రాక్టీస్ చేసే అవకాశం లభిస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే నిర్వాహకులు మాత్రం ప్రాక్టీస్కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
CSK Players and staff test negative for Corona