సింహాసనం కోసం ఇద్దరు యువరాజులు పోటీపడుతున్నారు
బీహార్ ప్రచారంలో తేజస్వి, రాహుల్పై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు
పాట్నా: బీహార్లో రెండో దశ ఎన్నికల ప్రచారం వాడీ వేడిగా సాగుతోంది. గత వారం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించగా తాజాగా ఎన్డిఎ అభ్యర్థుల తరఫున ఆదివారం నాడు ప్రధాని చాప్రా, సమస్తిపూర్లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని పుల్వామా దాడి ఘటనపై ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. ఈ దాడిలో తమ హస్తం ఉందని పాక్ ప్రభుత్వం తమ పార్లమెంటులోనే అంగీకరించిన తర్వాత ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన బిహార్ ముద్దుబిడ్డల గురించి పట్టించుకోని వారి నిజస్వరూపాలు బైటపడ్డాయని దుయ్యబట్టారు. చాప్రాలో జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు యువరాజులకు ఏ గతి పట్టిందో .. ఇక్కడ కూడా అదే గతి పడ్తుందని పరోక్షంగా రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ పేర్లను ప్రస్తావించారు. బీహార్లో ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ తరఫున రాహుల్ ప్రచారం చేయడాన్ని గుర్తు చేస్తూ, బీహార్లో సింహాసనం కోసం మళ్లీ ఇద్దరు యువరాజులు ప్రయత్నిస్తున్నారన్నారు.
అందులో ఒకరు ‘జంగిల్ రాజ్’ తనయుడు తేజస్వి అని మీ అందరికీ తెలుసన్నారు. యుపిలో కాంగ్రెస్కు ఎదురైన పరాభవమే బీహార్లో కూడా ఎదురవుతుందన్నారు. ‘ మూడు, నాలుగేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లో ఇద్దరు యువరాజులు ప్రజల మధ్యకెళ్లి చేతులు ఊపారు. వారిని ప్రజలు తమ ఓటుతో అటునుంచి అటే పంపేశారు. బీహార్లో కూడా అదే జరుగుతుంది’ అని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయింది. తాజాగా బీహార్లో కాంగ్రెస్ తేజస్వి నేతృత్వంలోని ఆర్జెడి కలిసి బరిలో దిగుతున్నాయి. ఇక్కడా గత ఫలితాలే పునరావృతమవుతాయని ప్రధాని వ్యాఖ్యానించారు. బీహార్లో ప్రస్తుతం రెండు ఇంజన్ల ప్రభుత్వం నడుస్తోందని ఆర్జెడి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలను మోడీ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. డబుల్ ఇంజన్ ఎన్డిఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకుంది. అందుకే ‘ డబుల్ క్రౌన్ప్రిన్సెస్’ సింహాసనం కోసం పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు.