వందేమాతరం గీతాన్ని ఆలపించిన మిజోరాం చిన్నారి ఎస్తేర్
న్యూఢిల్లీ: భారతీయులను ఉత్తేజపరిచే ‘ వందేమాతరం’ గీతాన్ని మృదుమధురంగా ఆలపించిన నాలుగేళ్ల బాలికను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్ తంగా ట్వీట్ చేసిన ఈ బాలిక వీడియోను మోడీ శనివారం రీట్వీట్ చేశారు. మిజోరాంలోని లుంగ్లేయికి చెందిన నాలుగేళ్ల బాలిక ఎస్తేర్ హ్నమ్టే ‘ వందేమాతరం’ గేయాన్ని ఆలపించింది. ఆమె ఆలపించిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె జాతీయ పతాకాన్ని పట్టుకొని‘ వందేమాతరం’ గీతాన్ని ఆలపించింది. ఈ వీడియోను జోరమ్ తంగా ట్వీట్ చేశారు.‘ అమ్మా నీకు వందనం అంటూ మిజోరాం పాడుతోంది. వందేమాతరం’ అని పేర్కొన్నారు.
ఈ వీడియోను శనివారం మోడీ రీ ట్వీట్ చేశారు. ‘ఎస్తేర్ హ్నమ్టే ప్రదర్శన అద్భుతం. అభిమానించదగినది’ అంటూ ప్రశంసించారు. ఎస్తేర్ తనకు గర్వకారణమన్నారు. కాగా ఎస్తేర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వేలాది లైక్లు వస్తున్నాయి. రీట్వీట్లు వస్తున్నాయి. యూట్యూబ్లో పూర్తి వీడియో ఉంది. ‘ సోదర సోదరీ మణులారా మీరు భారతీయులైనందుకు గర్వించండి. ఇది ప్రేమ,సంరక్షణ, ఆత్మీయతల నిలయం. అనేక భాషలు, సంస్కృతులు, జీవన శైలులు ఉన్న అద్భుత దేశం. వైవిధ్యం ఉన్నప్పటికీ మనమంతా కలిసికట్ట్టుగా ఈ మాతృభూమి ముద్దుబిడ్డలుగా మెలగుదాం’ అన్న శీర్షికతో ఈ వీడియోను యూట్యూబ్లో పెట్టారు.
Adorable and admirable! Proud of Esther Hnamte for this rendition. https://t.co/wQjiK3NOY0
— Narendra Modi (@narendramodi) October 31, 2020