Monday, April 29, 2024

జిహెచ్‌ఎంసి ట్రాఫిక్‌పై సీనియర్ పోలీసు అధికారులతో డిజిపి రవి గుప్తా సమీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలోని ట్రాఫిక్ పరిస్థితిపై తెలంగాణ డిజిపి రవి గుప్తా మంగళవారం సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డి, అదనపు డిజిపి సంజయ్ కుమార్ జైన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, ఐజి తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ప్రజల సౌకర్యార్థం జిహెచ్‌ఎంసి పరిధిలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి, మెరుగుపరచడానికి సమర్థవంతమైన చర్యలపై పోలీస్ అధికారుల సూచనలు డిజిపి కోరారు. విజిబుల్ పోలీసింగ్‌ను అమలు చేయడం, ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక శిక్షణ అందించడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో కొత్త స్కైవాక్‌లు, ఫ్లైఓవర్‌ల చుట్టూ ట్రాఫిక్ పరిస్థితులను వివరిస్తూ ట్రాఫిక్ పోలీసు అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను డిజిపికి వివరించారు. మూసీ నది ప్రాంతంలో వంతెనల పరిస్థితి, ప్రతిపాదిత ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కేంద్రం ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. జిహెచ్‌ఎంసి ట్రాఫిక్‌ను మరింత మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను వ్యక్తం చేసిన డిజిపి, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక చర్యల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అందించిన సిఫారసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News