మానవత్వం చాటిన సుల్తానాబాద్ వైద్యాధికారి శ్రీరామ్
ట్రాక్టర్లో కరోనా మృతదేహాన్ని తరలించిన ప్రత్యేకాధికారి
పెద్దపల్లి : కరోనా వ్యాధిగ్రస్తులకు సేవలందించిడమే కాదు.. ఆ మహమ్మారి కాటుకు గురై చనిపోయిన వ్యక్తుల విషయంలోనూ వైద్యులు మానవత్వం చాటుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాధితో చనిపోయాడు. దీంతో ఐసోలేషన్ వార్డులో ఉన్న రోగులు, ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మృతదేహాన్ని వెంటనే తీయాలని పట్టుబట్టారు. దీంతో ఆసుపత్రి అధికారులు పెద్దపల్లి మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అప్పటికే సాయంత్రం అయ్యింది.
చివరికి మున్సిపాలిటీకి చెందిన చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్ను ఆసుపత్రి వద్దకు తెచ్చిన డ్రైవర్.. ‘మా అధికారులు ఆసుపత్రి వద్ద ట్రాక్టర్ వదలి రమ్మన్నారు అని చెప్పి వెళ్లిపోయాడు. వైద్యాధికారులు ఎంత బతిమిలాడినా అతను వినలేదు. దీంతో చేసేదేమీలేక అక్కడే ఉన్న కరోనా జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీరామ్ కరోనా రోగి మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యుల సాయంతో ట్రాక్టర్లోకి ఎక్కించారు. తరువాత వైద్యుడు శ్రీరామ్ పిపిఈ కిట్ను ధరించి తానే స్వయంగా ట్రాక్టర్ను నడుపుతూ శ్మశానవాటిక వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో శ్రీరామ్ను జిల్లా వైద్యాధికారులు అభినందించారు. పెద్దపల్లి వైద్యుడు శ్రీరామ్ ను ట్విట్టర్ ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు.