Wednesday, May 1, 2024

కాంగ్రెస్ హయాంలో రెండు అంకెల్లో ద్రవ్యోల్బణం

- Advertisement -
- Advertisement -

మా ప్రభుత్వం 5 శాతం లోపు తగ్గించింది
ఇప్పుడు భారత్ విధాన నిర్దేశిత దేశం
ఈ ఏడాది చివరికి 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కానున్నది
ఐజిఎఫ్ శిఖరాగ్ర సదస్సులో హోమ్ మంత్రి అమిత్ షా

ముంబయి : కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రెండు అంకెల స్థాయికి చేరగా తమ ప్రభుత్వం 5 శాతం దిగువకు నియంత్రించిందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బుధవారం వెల్లడించారు. ముంబయిలో ఇండియా గ్లోబల్ ఫోరమ్ (ఐజిఎఫ్) వార్షిక పెట్టుబడి శిఖరాగ్ర సదస్సు నెక్ట్ 10లో అమిత్ షా ప్రసంగిస్తూ, 2014కు ముండు భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని, ద్రవ్యోల్బణం బాగా ఎక్కువగా ఉందని, ద్రవ్య లోటు నియంత్రణకు వీలులేని స్థితిలో ఉందని ఆరోపించారు.

ఇప్పుడు భారత్ విధాన నిర్దేశిత దేశంగా ఆవిర్భవించిందని చెప్పిన అమిత్ షా ఈ సంవత్సరాంతానికి దేశం 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కాగలదని సూచించారు. ‘2025 నాటికల్లా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలన్నది మా లక్షం’ అని మంత్రి ప్రకటించారు. వచ్చే రెండు సంవత్సరాలలో భారత్‌లో వామపక్ష తీవ్రవాదం బెడదను నిర్మూలించగలమని తన దృఢవిశ్వాసం అని హోమ్ శాఖ మంత్రి తెలియజేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర మంత్రి ‘గడచిన పది సంవత్సరాలలో మా ప్రభుత్వ పని తీరుతో, వచ్చే పాతిక సంవత్సరాలకు రోడ్‌మ్యాప్‌తో ఎన్నికలకు వెళుతున్నాం’ అని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీని దూరదృష్టి గల ప్రధానిగా అమిత్ షా శ్లాఘిస్తూ, 2047లో దేశం స్వాతంత్య్ర శత వార్షికోత్సవం జరుపుకునే సమయానికి భారత్ పూర్తిగా అభివృద్ధి చె ందిన, ఆత్మనిర్భర్ దేశం కాగలదని, ప్రపంచంలో మూడు అగ్ర శ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటి కాగలదని ధీమా వ్యక్తం చేశారు. ‘భారత్ ఆత్మ విశ్వాసం గల, స్వయం సమృద్ధ దేశం. తిరోగమన పథం నుంచి ప్రగతిశీలక దేశంగా, లోపభూయిష్ట ఆర్థిక వ్యవస్థ నుంచి అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది’ అని అమిత్ షా చెప్పారు. గత పది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని పూర్వపు యుపిఎ ప్రభుత్వ దశాబ్దంతో పోల్చి చూడాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ తరువాత పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ బిజెపియే అని ఆయన చెప్పారు.

2013=14లో జిడిపి వృద్ధి 6.9 శాతం కాగా ఇప్పుడు అది 8.4 శాతంగా ఉందని మంత్రి తెలిపారు. యుపిఎ హయాంలో 3889 అమెరికన్ డాలర్లుగా ఉన్న తలసరి జిడిపి వృద్ధి రేటు మోడీ ప్రభుత్వ హయాంలో 6000 అమెరికన్ డాలర్లకు ఎగసిందని అమిత్ షా తెలియజేశారు. బిజెపి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్షాల గురించి అమిత్ షా ప్రస్తావిస్తూ, 2036 ఒలింపిక్ క్రీడోత్సవాలను నిర్వహించాలని, 2040 నాటికి చంద్రునిపైకి మనిషిని పంపాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతర్గత భద్రత, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో దేశం సురక్షితంగా మారుతున్నదని కూడా హోమ్ శాఖ మంత్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News