Monday, April 29, 2024

మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఇడి నోటీసులు!?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు చెందిన శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫెమా నిబంధనల కింద జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. శ్వేతా గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్ పేరిట గ్రానైట్ కంపెనీలను గంగుల సుధాకర్, గంగుల వెంకన్న నిర్వహి స్తున్నారు. గ్రానైట్స్‌ను చైనాకు ఎగుమతి చేసిన ఈ రెండు కంపెనీలు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇడి అధికారులు తేల్చారు.

ఈ క్రమంలోనే చైనాకు గ్రానైట్ ఎక్స్‌పోర్ట్‌లో అవకతవకలు జరిగినట్టుగా నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ అక్రమంగా తరలించినట్టుగా ఇడి అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రూ. 4.8 కోట్ల మేర ఉల్లంఘనలకు పాల్పడినట్టుగా గుర్తించినట్టుగా సమాచారం. హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినట్టుగా తేల్చారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులో రూ. 50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా రూ. 3 కోట్లు మాత్రమే చెల్లించినట్టుగా ఇడి అధికారులు గుర్తించారు. ఇడి నోటీసులపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. మీడియా వాళ్లు చెబితేనే తనకు తెలిసిందన్న మంత్రి గంగుల 2008 నుంచి ఇడి నోటీసులు వస్తూనే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. 3 దశాబ్దాలుగా శ్వేతా గ్రానైట్స్ ఎప్పుడూ తప్పు చేయలేదని గిట్టని వాళ్లు తమపై ఎన్నో ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. ఇడి నోటీసులు ఇస్తే పత్రాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నానన్న ఆయన తాము బ్యాంకు లావాదేవీలు చేశామని, హవాలా చేయలేదని స్పష్టం చేశారు.

మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన ఈ గ్రానైట్స్ సంస్థల్లో గతేడాది నవం బర్‌లోనూ ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌లోని మంత్రికి సంబంధించిన సంస్థలు సహా 9 గ్రానైట్ కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయని పేరాల శేఖర్‌రావు అనే వ్యక్తి 2021లో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై 2019లో బండి సంజయ్ సైతం కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదుల ఆధారంగా గత సంవత్సరం నవంబర్ నెలలో ఇడి, ఐటి శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్, కరీంనగర్‌లోని గ్రానైట్ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హిమాయత్ నగర్‌లోని శ్వేతా గ్రానైట్స్ సహా బంజారాహిల్స్‌లోని గ్రానైట్ కార్యాలయంలో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న ఎకరాల కంటే ఎక్కువ స్థలంలో మైనింగ్ చేస్తున్నట్లు ఇడి అధికారులకు ఫిర్యాదులందాయి. తద్వారా పర్యావరణానికి నష్టం వాటిల్లడమే కాక ప్రభుత్వ ఖజానాకూ నష్టం చేకూర్చారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. గతంలో 9 మైనింగ్ సంస్థలకు ప్రభుత్వం రూ.750 కోట్లు జరిమానా విధించినా చెల్లించకుండా అక్రమ మార్గంలో మినహాయింపు పొందినట్లు దర్యాప్తు సంస్థల దృష్టికి వచ్చింది. ఇదిలా ఉండగా కరీంనగర్ గ్రానైట్‌కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో పెద్ద మొత్తంలో చైనాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎగుమతి చేసిన గ్రానైట్‌కు కాకుం డా తక్కువ మొత్తంలో రాయల్టీ చెల్లించినట్లు ఈ సంస్థలపై ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో ఇడి అధికారులు పూర్తి స్థాయి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఈ సోదాల్లో లభించిన వివరాల ఆధారంగా ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేల్చిన అధికారులు జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు
బిఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకే…
ఏదేమైనా రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకున్న ప్రస్తుత తరుణంలో బిఆర్‌ఎస్‌కు మళ్లీ ఇడి కలవరం మొదలైంది. ఈ ఎన్నికల్లోనూ తామే గెలిచి హ్యాట్రిక్ కొట్టాబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న ’కారు’ నేతలకు ఈ దర్యాప్తు సంస్థల దాడులు, నోటీసులు కొత్త కలవరాన్ని కలిగిస్తున్నాయి. మరోవైపు బిఆర్‌ఎస్‌ను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల ముంగిట కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News