Monday, April 29, 2024

తెలంగాణ టూరిజాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి

- Advertisement -
- Advertisement -

ఎసి స్లీపర్ బస్సుల ప్రారంభంలో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : తెలంగాణ టూరిజాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అందులో భాగంగా దేశ , విదేశీ టూరిస్టులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి తిరుపతి , హైదరాబాద్ నుండి షిరిడికి రెండు ఎసి స్లీపర్ బస్సులు , హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఎసి మినీ బస్‌లను శుక్రవారం రవీంద్రభారతి ముందు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంఛనంగా జెండా ఊప ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పర్యాటక బస్సులు ఇప్పటికే పలు చోట్లకు తీరుగుతున్న క్రమంలో నూతనంగా 3 కోట్ల 50 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 2 అత్యాధునిక ఓల్వో మల్టీ ఎక్సెల్ కోచేస్ ఎసి స్లీపర్ కోచ్ బస్సులను రూ. 32 లక్షల 61 వేల రూపాయలతో కొనుగోలు చేసిన మినీ ఎసి బస్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. షిరిడీ బస్సులకు భారీగా ఆదరణ ఉందని, అలాగే.. హైదరాబాద్ , తిరుమల తిరుపతికి తాజాగా రెండు రోజులు ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఈ 2 బస్సులను పర్యాటకుల సౌలభ్యం కోసం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తిరుపతి తిరుమల రెండు రోజులు భాగంగా పెద్దలకు రూ. 4200, పిల్లలకు రూ. 3360లతో ప్రత్యేక టూర్ ప్యాకేజ్ ని తెలంగాణ పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గతంలో ఈ రూట్ లలో స్లీపర్ బస్సులు ఉన్నప్పటికీ , ప్రయాణికుల డిమాండ్ మేరకు మరో రెండు బస్సులను తాజాగా ప్రారంభించామన్నారు.

తెలంగాణ టూరిజం అంటే ప్రజల్లో నమ్మకం ఉందని… ఆ నమ్మకాన్ని అలాగే ముందుకు కొనసాగిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు తో సహా ఇతర ప్రాజెక్టులు , ముఖ్యమైన ప్రదేశాలను టూరిజం హబ్ గా మారుస్తామన్నారు.బుకింగ్ సదుపాయ వివరాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. పర్యాటకులు ఆన్‌లైన్ రిజర్వేషన్ సిస్టమ్ (www.tstdc.in)ను సంప్రదించాలన్నారు. టిఎస్ టిడిపి బుకింగ్ కౌంటర్లు సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం బషీర్‌బాగ్‌లోని 04029801039, సెల్ 9848540371ను , లేదా టూరిజం ప్లాజా బేగంపేట్ సెల్ 9848306435ను సంప్రదించాలని సూచించారు. ఈ బస్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, పర్యాటకాభివృద్ధిశాఖ ఎండి మనోహర్, అధికారులు మధురారెడ్డి, పిఆర్‌ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన బాక్సింగ్ క్రీడాకారుడు
కాగా ఎసి స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవ సమాచారం తెలుసుకుని హైదరాబాద్ కు చెందిన బాక్సింగ్ క్రీడాకారుడు దేవానందనం రవీంద్రభారతికి రాగా ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన్ను అభినందించారు. దేవానందనం ఇటీవల నేపాల్ లో సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్‌లో 79 కెజి విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి దుబాయిలో ఈనెల 30 నుండి ఆగస్టు 19 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్ ఛాంపియన్షిప్ దుబాయ్ – 2023 కు ఎంపికైన సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన్ను
అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News