బెంగళూరు: వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన కర్నాటకలోని బెంగళూరు ప్రాంతం కామాక్షిపాల్యా ప్రాంతంలో జరిగింది. దంపతుల కుమారుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నరసింహ్మా రాజు (70), సరస్వతీ(60) అనే దంపతులు రంగనాథపురంలోని మహాదేశ్వర దేవాలయం వెనుక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సరస్వతీ గతంలో టీచర్గా పని చేసేదని, రాజు పెళ్లి సంబంధాలు కుదుర్చేవాడు. వయసు మీదపడడంతో ఇంట్లోనే ఉంటున్నారు. ఆ దంపతులకు సంతోష్ అనే కుమారుడు ఉన్నాడు. సంతోష్ తన తల్లిదండ్రులతోనే కలిసి ఉండేవాడు. సంతోష్ భార్య గర్భిణీ కావడంతో తన అమ్మగారింటికి వెళ్లిపోయింది. గతంలో పలుమార్లు ఆ తల్లిదండ్రులతో సంతోష్ గొడవపడేవాడు. రెండు రోజుల క్రితం పని మనిషి వచ్చి చూసేసరికి నరసింహ్మా రాజు ముందు రూమ్లో విగతజీవిగా కనిపించాడు. లోపలికి వెళ్లి చూడగా సరస్వతీ కూడా నేల మీద పడి ఉండడంతో ఆమె స్థానికులకు సమాచారం ఇచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు ఘటనా స్థలంలో లేకపోడంతో అతడే తన తల్లిదండ్రులను చంపి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.