Saturday, May 4, 2024

దేశంలో కరెంటు తెగ వాడేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్‌కు డిమాండ్ భారీగా డిమాండ్ పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఏప్రిల్‌ నవంబర్ మధ్య కాలంలో దేశంలో విద్యుత్ వినియోగం 9 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. ఏప్రిల్‌నవంబర్ మధ్య కాలంలో మొత్తం విద్యుత్ వినియోగం 1099.90 బిలియన్ యూనిట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే సమయంలో విద్యుత్ వినియోగం 1010.20 బిలియన్ యూనిట్లుగా ఉంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విద్యుత్ వినియోగం 1,504.26 బిలియన్ యూనిట్లుగా ఉంది. ఇది 2021 22 ఆర్థిక సంవత్సరం వినియోగం 1,374.02 బిలియన్ యూనిట్లకన్నా అధికం. ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో విద్యుత్ వినియోగం 9 శాతం పెరగడానికి దేశ ఆర్థిక కార్యకలాపాలు పెరగడమే కారణమని ఇంధన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2013 14ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022 23ఆర్థిక సంవత్సరం నాటికి విద్యుత్‌వినియోగం 50.8 శాతం పెరిగిందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్.కె సింగ్ ఇటీవల లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.

2013 14 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 136 గిగావాట్లు కాగా 2023లో ఈ డిమాండ్ 243 గిగావాట్లకు పెరిగిందని మంత్రి చెప్పారు. కాగా విద్యుత్ సామర్థాన్ని 196 గిగావాట్ల మేర పెంచామని, అందువల్ల పెరుగుతున్న డిమాండ్‌తో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన చెప్పారు. కాగా ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు పెరుగుతుందని ఇంధన శాఖ అంచనా వేసింది. అయితే ఏప్రిల్‌జూలైలో కురిసిన అకాల వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ కాస్త తక్కువగా ఉండడంతో ఇప్పటికీ విద్యుత్ డిమాండ్ ఆశించిన దానికన్నా తక్కువగానే ఉంది.గత జూన్‌లో దేశంలో విద్యుత్ డిమాండ్ 224.1 గిగావాట్లు ఉండగా జులైలో అది 209.03 గిగావాట్లకు పడిపోయింది. అయితే ఆగస్టులో 238.82 గిగావాట్లు, సెప్టెంబర్‌లో 243.27 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది.

అక్టోబర్‌లో 222.16 గిగావాట్లుండగా, నవంబర్‌లో 204.86 గిగావాట్లకు తగ్గింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే , జూన్ నెలల్లో వర్షాల కారణంగా విద్యుత్ వినియోగం తగ్గినా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు పారిశ్రామిక కార్యకలాపాలు కూడా పెరగడంతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News