Saturday, April 27, 2024

ఆలోచన మారితే మనోభావాలు దెబ్బతినవు

- Advertisement -
- Advertisement -

Emotions are not damaged if the thinking changes

ఆలోచన లేని వ్యక్తితో చర్చించడం అంటే, చనిపోయిన మనిషి శరీరంలోకి ఔషధాన్ని ఇంజెక్టు చేయడం లాంటిది థామస్ పెయిన్ (1737-1809) అమెరికన్ తత్వవేత్త, రాజకీయ సిద్ధాంత కర్త. దళితుల చేతితో నీళ్లు తాగడానికి నిరాకరించిన ఈ దేశంలోని పెద్ద మనుషులు ఈ రోజు ఒక జంతువు మూత్రం సంతోషంగా తాగుతున్నారు. దేశం ఎంత ముందుకు పోతూ వుందో, ఎంత వెలిగిపోతూ వుందో ప్రపంచం గమనిస్తూనే వుంది. గోమూత్రం అంత పవిత్రమైనదే అయితే, దేవుళ్ల అభిషేకాలకు ఎందుకు వాడడం లేదూ? అని నేటి యువతరం ఒక ప్రశ్నను సంధిస్తోంది. సరస్వతి శిశుమందిర్‌ల పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ వారు లక్షలాది ఆదివాసీ బాల బాలికల పసి మనసుల్ని కలుషితం చేస్తున్నారు. జరగబోయే ప్రమాదాన్ని గ్రహించి జాగ్రత్త పడాల్సి వుంది. అయినా విద్యాలయాలపై దాడులు, యూనివర్శిటీలపై దాడులు వీరికి కొత్త కాదు. లోగడ నలంద, విక్రమశిల, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసింది వీరి పూర్వీకులేనన్నది గమనించాలి! ఇటీవల జెఎన్‌యు పై దాడులు కూడా ఎవరు చేయించారో అందరికీ తెలిసిన విషయమే.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి దాడుల్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ ఆఫ్రికా నల్లజాతి తొలి అధ్యక్షుడు, జాతి వివక్షపై జీవితాంతం పోరాడిన విప్లవవీరుడు నెల్సన్ మండేలా ఇలా అన్నారు. “మన ప్రపంచం జాతి, మత, రంగు, లింగ భేదాలతో విభజింపబడి లేదు. కేవలం వివేకవంతులు, మూర్ఖులు అని రెండు రకాలుగా మాత్రమే విభజింపబడి వుంది. మూర్ఖులే జాత, మత, రంగు, లింగ భేదాలతో తమని తాము విభజించుకున్నారు” ప్రపంచంలో సుమారు 192 దేశాలున్నాయి. అందులో 750 కోట్ల జనాభా వుంది. వీరికి 4200 మతాలున్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క మతమూ మనుషులంతా సమానులని చెప్పలేకపోయింది. పోనీ సమానులుగా వుంచలేకపోయింది. దానికి కారణమేమిటీ? అని ఇకనైనా మనం ఆలోచించుకోవాలి కదా? మతం అణచివేయబడ్డ జీవి నిట్టూర్పు. హృదయంలేని ప్రపంచంలో హృదయం లాంటిదని స్ఫూర్తి లేని ప్రపంచంలో స్ఫూర్తి లాంటిదని కొందరు అభిప్రాయపడతారు.

ఏది ఏమైనా ఒక రకంగా మతం ప్రజల పాలిట మత్తు మందు. ఆనందంగా వున్నామని భ్రమలు కల్పించే మతం రద్దు కావాలంటే నిజ జీవితంలో నిజమైన ఆనందం సాధించబడాలి. ఆ నిజమైన ‘ఆనందం’ సాధించబడాలంటే ఏం చేయాలో మార్క్ ఏంగిల్స్ చెప్పారు. “మత భావనలు బలంగా కొనసాగడానికి అదృష్టం, అతీతశక్తులు, దేవుళ్లపై నమ్మకాలకు భౌతిక పునాది ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. వాటిని రూపు మాపి, భావజాల పోరాటం కూడా జోడిస్తే.. అప్పుడు మనిషికి మతం అవసరం తొలగిపోతుంది. మతం అంతరించిపోతుంది.” అన్నాడు మార్స్. “మతాన్ని తొలగించాలంటే మతం సృష్టించిన పరిస్థితుల్ని తొలగించాలి. సమాజంలోని దోపిడీని వ్యతిరేకించి పోరాడకుండా దాని ప్రతిబింబమైన మతంపై పోరాడడం వలన ఉపయోగముండదు” అని చెప్పాడు ఏంగిల్స్.

ఆ మహానుభావుల అభిప్రాయాలు మనకు శిరోధార్యమే. కాని స్వాతంత్య్రానంతరం ఈ దేశంలో యేం జరుగుతూ వస్తోందో మనకు తెలుసు. మనిషికి మతం అవసరం లేని పరిస్థితిని ప్రభుత్వాలు గాని, రాజకీయ పార్టీలు గాని, సామాన్య పౌరులు గానీ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయా?/చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి! దేవుడు, దయ్యం, మతాల జోలికి పోకుండా ఇన్నేళ్లూ వామపక్షాలు దోపిడీని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నారు. అది సరిపోవడం లేదు కదా? ఏమైనా మంచి ఫలితాలు వచ్చాయా? ‘మతం సృష్టించిన పరిస్థితుల్ని తొలగించాలి’ అని అన్నాడు ఏంగిల్స్ మరి ఈ దేశంలో వామపక్షాలు ఆ పని చేస్తూ వచ్చాయా? మతం సృష్టించిన పరిస్థితులు తొలగించాంటే, తప్పకుండా జనంలో వైజ్ఞానిక స్పృహ పెంచడం అవసరం. ఆ దిశలో వామపక్షాలు ఎందుకు కృషి చేయడం లేదూ? ఎంత సేపూ పోరాటాలు, హక్కులు, ధర్నాలు దగ్గరే గిరిగీసుకుని ఉన్నాయే? మతం/ దేవుడు/ మూఢ నమ్మకాలు వంటి అంశాల్ని ఎందుకు వదిలేశారు? ఇక్కడ వామపక్షాల గూర్చి మాట్లాడడం ఎందుకంటే చేస్తే, అంతో ఇంతో అవే చేయాలి! బూర్జువా రాజకీయ పార్టీలు ఇలాంటి విషయాలు పట్టించుకోవు. వారు నోట్లు పంచి ఓట్లు దండుకునే పనిలో తీరిక లేకుండా వుంటారు. అధికారం చేజిక్కించుకోవడానికి దిగజారిన రాజకీయాలు చేస్తూ ఊపిరి సలపనంత బిజీగా వుంటారు. వారితో ప్రజా చైతన్య కార్యక్రమాలు జరుగుతాయని ఊహించలేం.

బూర్జువా నాయకుల ప్రకటనలు పని తీరు ఏ విధంగా వుంటుందో అందరికీ తెలిసిందే. అయినా ఇక్కడ కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. 2019లో రామ మందిరం కట్టలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు సాక్షి మహరాజ్. రామ మందిరం కట్టిందీ లేదు. ఆయన రాజకీయాలు వదిలి వెళ్లిందీ లేదు. 2018 లోపు గంగానదిని శుభ్రం చేయించలేకపోతే జల సమాధి చేసుకుంటానన్నది ఉమా భారతి. గంగానదిని శుభ్రం చేయించిందీ లేదు. ఆమె తనను తాను జల సమాధి చేసుకున్నదీ లేదు. వంద రోజుల్లో నల్లధనం వెలికి తీయలేకపోతే నన్ను ఉరి తీయండి! అని అన్నాడు ఈ దేశ ప్రధాని. ఆ ప్రధాని పీఠమ్మీద ఇప్పటికి 78 ఏళ్లుగా కూర్చు న్నా, ఆ పని చేయలేక నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. పైగా ప్రతి భారతీయుడి అకౌంట్లో రూ. పదిహేను లక్షలు వేస్తానన్న ఆ పెద్ద మనిషి నిజాయితీని ఏమని పిలుద్దాం? బిజెపి పాలిత రాష్ట్రాల్లో హత్యలు/ లైంగిక దాడులు/ కిడ్నాపులు/ దళితులపై దాడులు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. వాటికి బాధ్యులైన వారు, దేశ ప్రజలనుద్దేశించి వివరణలు ఇవ్వాలి కదా? మరి ఏమైందీ?

దేశంలో పన్ను చెల్లింపుదారుల డబ్బును వివిధ బ్యాంకుల్లోంచి దోచుకుని పారిపోయిన భారతీయ వ్యాపార వేత్తలు ముఖ్యంగా ఇరవై ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎవరూ ముస్లింలు లేరు, దళితుల్లేరు, బహుజనుల్లేరు. పోనీ నక్సలైట్లో, అర్బన్ నక్సల్సో ఉన్నారా అంటే వాళ్లు కూడా లేరు. కేవలం గుజరాత్‌కు చెందిన వారే వున్నారు. వారంతా కలిసి దోచుకున్నది పది లక్షలు కాదు. పది లక్షల కోట్లు ‘మాత్రమే’? మరి ఈ దేశ కాపలాదారు ఏమయ్యాడూ? ఇంకా చాయ్ అమ్ముకుంటూనే దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడా? లేక దేశీయ సంస్థల్ని ప్రైవేటు వారికి అమ్ముకుంటూ దేశమంతా తిరుగుతున్నాడా? పెంచిన గడ్డానికో మాస్క్ తగిలించుకుని, ఎలక్షన్ ర్యాలీలు తీస్తూ, కుంభమేళాలు జరిపిస్తూ కరోనా వ్యాప్తిలో తలమునకలై వున్నాడా? ఏం చేస్తున్నట్టూ? ప్రతి ఎకౌంట్‌లో పదిహేను లక్షలు వేయడం తర్వాతి మాట. ముందు సగటు మనిషి ఎకౌంట్లో మూడు నాలుగు వేలు కూడా లేకుండా చేయడానికి పథకాలు రచిస్తున్నాడా? మిగతా పాలకులు ఏమయ్యారూ? వ్యవస్థలు ఏమయ్యాయీ? దేశం చుట్టూ వున్న మూడు సముద్రాల్లో ఈ దేశాన్ని ఏ సముద్రంలో ముంచబోతున్నారూ?

దేశాన్ని ముంచిన వ్యాపారవేత్తల పేర్లు: 1.విజయ మాల్యా 2. మెహుల్ చోక్సీ 3. నీరవ్ మోడీ 4. నిషన్ మోడీ 5. పుష్పేష్ బైద్య 6. ఆశిష్ 7. సన్నీ కల్రా 8. ఆర్తి కల్రా 9. సుంజయ్ కల్రా 10. వర్షా కల్రా 11. సుధీర్ కల్రా 12. జతిన్ మెహతా 13. ఉమేష్ పరిఖ్ 14. కమలేశ్ పరిఖ్ 15. నీలేశ్ పరిఖ్ 16. వినయ్ మిట్టల్ 17. ఏకలవ్యా గార్గ్ 18. చేతన్ లాల్ 19. నితిన్ లాల్ 20. దీప్తి బెన్ చేతన్ 21. సవియా సేట్ 22. రాజీవ్ గోయెల్ 23. అల్య గోయెల్ 24. లలిత్ మోడీ 25. రితేష్ జైన్ 26. హితేశ్ పటేల్ 27. మయూరి బెన్ 28. ఆశిష్ భాయ్ పారిపోయే దొంగల్ని చౌకీదార్ నిలదీయ లేదంటే, పట్టుకోలేదంటే, విజిలేసి, నలుగుర్ని కేకేసి గోలగోల చేయలేదంటే ఏమిటి అర్థం? చౌకీదార్ దొంగలతో లాలూచీ పడ్డాడని కదా అర్థం? ఇక్కడ ఒక్క చౌకీదారంటే చౌకీదారనే కాదు. ఆ స్థానంలో వున్న వ్యవస్థలు/ ప్రభుత్వాధి నేతలు అందరికందరూ దోషులేనన్నది ఈ దేశ ప్రజల తీర్పు. అయితే దానికి కారణం చౌకీదార్ అతని టీం మాత్రమే కాదు. అనాలోచితంగానో, డబ్బుకు ఆశపడో అనర్హులను /అసమర్థులను ఎనుకున్న తప్పు ఎవరిదీ? ఈ దేశ మూర్ఖ ప్రజలది కాదా? ఎవరికి వారు ఆలోచించాలి?

ఈ దేశ ప్రజలు చేస్తున్న దుర్మార్గమైన పని ఏమిటంటే చదువు లేని అవివేకుల్ని పలు మార్లు గెలిపిస్తారు. తీవ్రవాద ఆరోపణలున్న వారినీ గెలిపిస్తారు. ఇళ్లలో దూరి దౌర్జన్యాలు చేసే గూండాలను గెలిపిస్తారు. అసెంబ్లీలో కూర్చుని నీలి చిత్రాలు చూసే హీనుణ్ణీ గెలిపిస్తారు. ఇక రేపిస్టులనైతే చాలా ఘనంగా గెలిపిస్తారు. ఇలాంటి పనికిమాలిన వాళ్లని గెలిపించి పైగా లబోదిబోమంటుంటారు. “అయ్యో! నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదని”.. ఏడుస్తూ పెడబొబ్బలు పెడతారు. అవన్నీ అవసరమా? విద్యావంతులకు, వివేకవంతులకు, సమర్థులకు, నీతి నిజాయితీ, నిబద్ధతా గల యువతీ వయకులకు దేశంలో కొదవ లేదు. దేశాన్ని కాపాడుకోవడానికి వీళ్లంతా బయటికి రావాలి.

ధైర్యంగా ప్రస్తుత పరిస్థితుల్ని ఎ దుర్కోవాలి! జనం వారికి అండగా నిలబడి గెలిపించాలి. దేశం బాగుపడాలంటే అదొక్కటే మార్గం. అయినా తరతరాలుగా మెదళ్లలో కుల మతాల, వర్ణ, వర్గాల, లింగ రంగు భేదాల మకిలి పేరుకు పోయి వుంటే వివేకం, సమానత్వం ఎలా సాధ్యం? సైన్సు గాడ్జెట్లు వాడుతున్నాం కదా? ఇక ఆధునికులమై పోయినట్టే అని అనుకుంటే అది బుద్ధి తక్కువే అవుతుంది. పైగా ప్రతి పనికిమాలిన వాడూ మనోభావాల గూర్చి మాట్లాడడం ఫ్యాషనై పోయింది. ఏదో ఇతరు లెవ్వరికీ మనోభావాలు వుండవన్నట్లు అందువల్ల కొంచెం ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభిస్తే, వైజ్ఞానిక స్పృహ అంటే ఏమిటో తెలుస్తుంది. అది తెలిసిన వారిని మనోభావాలు బాధించవు. ప్రతి విషయాన్నీ మనోబలంతో విశ్లేషించుకో గలిగే స్తోమత వస్తుంది. స్థాయి పెరుగుతుంది.

డా. దేవరాజు- మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News