Monday, April 29, 2024

రాహుల్ పాదయాత్ర… బిజెపి అంతిమయాత్ర

- Advertisement -
- Advertisement -

డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధానిలే…
లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించగానే ఆదానీ ఇంజన్ షెడ్‌కు పోయింది
రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజన్ కూడా పని చేయదు
నాగ్‌పూర్ కాంగ్రెస్ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతి మందుకు ఒక ఎక్సపయిరీ డేట్ ఉంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే మెడిసిన్‌కు ఎక్సపయిరీ డేట్ అయిపోయిందని, రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ మెడిసిన్ ఈ దేశంలో పని చేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం నాగ్‌పూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ 139వ ఆవిర్భావ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నరేంద్ర మోడీ ఎప్పుడూ చప్పన్ ఇంచ్ ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటారు, కానీ, ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోకసభలోనే ఒక సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమీ చేయలేకపోయారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మోడీ జీ మీరు ఒక సామాన్య వ్యక్తి ని పార్లమెంట్ లో రాకుండా ఆపలేకపోయారు, రేపు ఎర్రకోట మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరకుండా ఆపడం కూడా మీతరం కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అదానీ, ప్రధాని
డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అదానీ, ప్రధాని తప్ప మరేంకాదని సిఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఒక్కసారి లోక్‌సభలో ప్రశ్నించగానే అదానీ ఇంజన్ ఆగిపోయిందని, రిపేర్ కోసం షెడ్‌కు పోయిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఈ సారి మణిపూర్ నుంచి ముంబై వరకు చేపడుతున్న భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజన్ కూడా పని చేయదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేపట్టే భారత్ న్యాయ్ యాత్రతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సిఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 150 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల మేర చేసిన భారత్ జోడో యాత్రతో మొదట కర్ణాటకలో తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు రాహుల్ యాత్ర మహారాష్ట్రలోకి వస్తుందని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రాబోయే 100 రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు చాలా కీలకమని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ 100 రోజులు దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కేటాయించి కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తీసుకువచ్చేందుకు కష్టపడాలని రేవంత్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులతో పాటు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపి డాక్టర్ మల్లు రవి,టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, టిపిసిసి జనరల్ సెక్రటరీ భూపతి రెడ్డి, టిపిసిసి కార్యవర్గ సభ్యులు మద్దుల సోమేశ్వర్ రెడ్డి, టిపిసిసి కిసాన్ సెల్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి, టిపిసిసి కోఆర్డినేటర్ సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డిలు పాల్గొన్నారు.
సేవాదళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ…
గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. దీంతో పాటుగా ఏఐసిసి సేవాదళ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీభవన్ లో సేవాదళ్ కార్యక్రమాలను జరిపారు. ఈ క్రమంలో గాంధీభవన్ నుంచి సెక్రటేరియట్ మీదుగా నెక్లస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం వరకు పిసిసి సేవాదళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టింది. ఈ సేవాదళ్ ర్యాలీని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, మాజీ మంత్రి మండువా వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News