Wednesday, May 1, 2024

చంద్రబాబు అంశంపై వివరణ

- Advertisement -
- Advertisement -

లోకేశ్, పవన్ కల్యాణ్, జగన్‌లు నాకు మిత్రులు అన్న కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు కేసు- హైదరాబాద్‌లో నిరసనల అంశంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మరోసారి స్పందించారు. ఓ మీడియా ఛానల్ ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ‘చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిరసనలు వద్దని, ఎపిలో చేసుకోమని చెప్పారని, అలా ఎందుకు మాట్లాడారు?’ అని ప్రశ్నించారు.

దీనికి కెటిఆర్ సమాధానం చెబుతూ గురువారం ఆర్మూర్‌లో ప్రచారరథంపై నుంచి తాను పడటంతో తనకు స్వల్పంగా గాయాలయ్యాయని, ఆ సమయంలో నారా లోకేశ్ తనకు ఎలా ఉంది? అని మెసేజ్ పెట్టారని తెలిపారు. తాను బాగానే ఉన్నానని సమాధానం ఇచ్చానన్నారు. అదే సమయంలో చంద్రబాబుకు సర్జరీ అయింది కదా ఎలా ఉన్నారు? అని అడిగితే బాగానే ఉన్నట్లు లోకేశ్ చెప్పారన్నారు. లోకేశ్ తనకు తమ్ముడిలా మిత్రుడని, పవన్ కల్యాణ్, జగన్‌లు కూడా అన్నల వలె తనకు మిత్రులు అన్నారు. తనకు ముగ్గురూ స్నేహితులేనని, వారందరితోనూ సత్సంబంధాలే ఉన్నాయన్నారు. వారితో తనకు ఎలాంటి రాజకీయ వైరం లేదన్నారు. ఎందుకంటే తన రాజకీయ క్షేత్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
అయితే తాను అలా మాట్లాడటానికి గల కారణం ఏమంటే అక్కడ జరిగిన రాజకీయ వైరం వల్ల జరిగిన చంద్రబాబు అరెస్ట్ ఘటనకు ఇక్కడ ఆందోళనలు జరిగితే అందరికీ నష్టమేనని తాను భావించి వద్దని చెప్పానని వెల్లడించారు. అయితే ధర్నా చౌక్‌లో ఎవరైనా నిరసనలు చేసుకోవచ్చునన్నారు.

ఎపిలో జరిగిన ఘటనకు ఇక్కడ ఒక పార్టీ నిరసనలు తెలిపితే మరో పార్టీ కంటిన్యూ చేయవచ్చునన్నారు. హైదరాబాద్ అలాంటి రాజకీయ ఆటకు వేదిక కావొద్దనేది తమ ఉద్దేశ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఎపిలో కూడా ఐటి కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇటీవల ఓ కంపెనీని తాను అభ్యర్థించానన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News