మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం
ముంబయి: సభా హక్కుల ఉల్లంఘనపై ఏర్పాటైన కమిటీ నివేదిక సమర్పించేందుకు గడువు పొడిగించడానికి మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల చివరి రోజు వరకూ నివేదిక సమర్పించడానికి కమిటీకి వెసులుబాటు కల్పించారు. రిపబ్లిక్ టివి ఎడిటర్ఇన్చీఫ్ అర్ణాబ్గోస్వామి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్లకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ అంశంపై మహారాష్ట్రలోని ఉభయసభల్లోనూ చర్చ జరిగింది. గడువు పెంపునకు ఉభయ సభల్లోనూ బిజెపి పక్షం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా, అధికార శివసేన, కాంగ్రెస్ పక్షం ఎంఎల్ఎలు, ఎంఎల్సిల నుంచి సానుకూలత వ్యక్తమైంది. గడువు పెంపు ప్రతిపాదనను శాసన మండలిలో బిజెపి పక్షం నేత ప్రవీణ్దరేకర్ వ్యతిరేకించగా, కాంగ్రెస్ ఎంఎల్సి అశోక్ అలియాస్ భాయీ జగతాప్ సమర్థించారు. సభాహక్కుల ఉల్లంఘన నోటీసులను గోస్వామి, రనౌత్ ధిక్కరించారని ఆరోపిస్తూ శివసేన ఎంఎల్ఎ ప్రతాప్సర్నాయక్ సెప్టెంబర్ 7న స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ముంబయి పాక్ ఆక్రమిత కాశ్మీర్లా తయారైందంటూ కంగనా వ్యాఖ్యానించడాన్ని శివసేన తప్పు పట్టిన విషయం తెలిసిందే. అర్ణాబ్ గోస్వామి విషయంలోనూ చట్టసభలను అవమానించేలా వ్యాఖ్యానించారన్న ఫిర్యాదులున్నాయి.