సూపర్స్టార్కు ప్రధాని మోడీ బర్త్డే గ్రీటింగ్స్
చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ 70వ జన్మదినం సందర్భంగా శనివారం అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోసహా పలువురు కీలక నాయకులు పుట్టినరోజు సందర్భంగా రజనీకి శుభాకాంక్షలు తెలియచేశారు.
చెన్నైలోని రజనీకాంత్ ఇంటి వద్దకు ఉదయమే భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. త్వరలోనే పార్టీని ప్రారంభించనున్నట్లు రజనీ ఇటీవల చేసిన ప్రకటనతో ఆనందంలో ఉన్న ఆయన అభిమానులు రజనీ మార్క్ ఇప్పో ఇల్లేన ఎప్పోవుమ్ ఇల్లై(ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు) వంటి డైలాగులతోపాటు తమ అభిమాన నాయకుడి ఫోటో ముద్రించిన టీ షర్టులు ధరించి సందడి చేశారు. మహిళా అభిమానులతోపాటు వందలాది మంది ప్రజలు నేరుగా శుభాకాంక్షలు తెలియచేయడానికి తెల్లవారుజాము నుంచే రజనీ ఇంటికి చేరుకున్నారు.
అయితే రజనీ ఇంట్లో లేరని తెలియడంతో వారు కొంత నిరాశకు గురయ్యారు. అనేక చోట్ల అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోగా ఆలయాలలో పూజలు చేసి కొందరు అభిమానులు ప్రసాదాన్ని ఆయన ఇంటి వద్దకు తెచ్చారు. భయం తెలియని నాయకుడు, తమిళనాడు భవిష్యత్తు నాయకుడు వంటి నినాదాలతో అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్లతో నగరాన్ని పలుచోట్ల అలంకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు పార్టీ ఇన్చార్జ్ సిటి రవి తదితరులు రజనీకాంత్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.