ఫిబ్రవరి 3న ఎన్నికల నోటీసు
6,7,8 తేదీల్లో నామినేషన్లు
10న గుర్తుల కేటాయింపు
15న పోలింగ్, ఫలితాలు
మనతెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు రాష్ట్ర సహకార ఎన్నికల సంస్థ ఎన్నికలు జరిగే షెడ్యూల్ను వెలువరించింది. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల అధికారి సహకార సంఘాల రైతులకు ఫారం 1 ద్వారా నోటీసును విడుదల చేస్తారు. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు సహకార ఎన్నికల్లో పోటీచేసే రైతుల నుంచి ఫారం 2 నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 9వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ కార్యక్రమాన్ని ఎన్నికల అధికారి చేపడతారు. ఫిబ్రవరి 10వ తేదీన నామినేషన్ వేసిన వారు ఉపసంహరించుకునే ప్రక్రియతో పాటు పోటీల్లో ఉన్న అభ్యర్థులతో కూడిన తుది జాబితాను వెలువరించడంతో పాటు పోటీపడుతున్న వారికి గుర్తులను కేటాయించడం జరుగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీన ఉ. 10 గం.ల నుంచి మ. 1.00 గం.ల వరకు పోలింగ్ను నిర్వహిస్తారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే అదే రోజు(ఫిబ్రవరి 15న) మధ్యాహ్నం ఓట్ల లెక్కింపును చేపడతారు. 15వ తేదీననే ఎన్నికల ఫలితాలను వెలువరిస్తూ ఎవరెవరు విజయం సాధించారనేది వెల్లడించడం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడని మూడు రోజుల్లో కార్యవర్గాన్ని ఎన్నికోవాల్సి ఉంటుంది.