ఆగ్రా: సెల్ఫోన్ దొంగతనం చేశారని ఇద్దరు కూతుళ్లను కన్న తండ్రి కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పూరిలో జరిగింది. తండ్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యుపి మంత్రి రామ్ నరేష్ అగ్నిహోత్రి వద్ద పవన్ శర్మ, సుఖ్దేవ్ శర్మ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. హోలీ వేడుకల సందర్భంగా పవన్ శర్మ కుటుంబ సభ్యులను సుఖ్దేశ్ శర్మ ఆహ్వానించాడు. పవన్ శర్మ తల్లి వద్ద ఉన్న నోకియా ఫోన్ కనిపించకపోవడంతో ఇల్లు మొత్తం ఫోన్ కోసం వెతికారు. సుఖ్ దేశ్ కూతుళ్ల నేహా(18), అనామిక(20) వద్ద ఫోన్ ఉండడంతో అతడికి అవమానం కలిగింది. వెంటనే ఇంటి నుంచి సుఖ్దేవ్ బయటకె వెళ్లి మద్యం సేవించి వచ్చాడు. కోపంతో ఊగిపోయిన సుఖ్దేవ్ నాటు తుపాకీతో తన ఇద్దరు కూతుళ్లను కాల్చాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నోకియా ఫోన్ విలువ రూ.1200 ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.