భోపాల్: సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు అసెంబ్లీలో బలనిరూపణ చేయడానికి కొద్ది గంటల ముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ రాజీనామా చేశారు. బెంగళూరులో తమ పార్టీ ఎమ్మెల్యేలను బందీలుగా ఉంచారని ఆరోపించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ నిజం వెలుగులోకి వస్తుందని, ప్రజలు వారిని క్షమించబోరని చెప్పారు. రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టించడంలో కీలక భూమిక పోషించిన బిజెపిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 15 నెలల్లో తాను అనేక సార్లు తన బలాన్ని నిరూపించుకున్నానని, ఈ రాష్ట్రాన్ని బిజెపి 15 ఏళ్లు పాలించగా తాను కేవలం 15 నెలలు మాత్రమే పాలించానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ను వీడి ఇటీవలే బిజెపిలో చేరి ఎంపిగా రాజ్యసభకు నామినేట్ అయిన జ్యోతిరాదిత్య సింధియాను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఒక నాయకుడితో కుట్ర పన్నిన బిజెపి తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను అపహరించి బెంగళూరులో దాచిందని కమల్నాథ్ ఆరోపించారు.