రియల్ ఎస్టేట్ సంస్థపై అటవీశాఖ చర్య, అధికారులను ప్రశంసించిన ఎంపి సంతోష్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎలాంటి అనుమతి లేకుండా చెట్లను నరికివేసిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థపై రాష్ట్ర అటవీ శాఖ కొరడా ఝుళిపించింది. సదరు సంస్థకు ఏకంగా నాలుగు లక్షల జరిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు పరిధిలో వెస్ట్సైడ్ వెంచర్స్ సంస్థ ఉంది. వారి భూమి పరిధిలో ఉన్న 65 చెట్లను సంస్థ ప్రతినిధులు గత వారం ఎలాంటి అనుమతులు లేకుండా నరికివేశారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయటంతో అటవీ శాఖ అధికారులు తనిఖీ చేశారు. చెట్లను విచక్షణారహితంగా తొలగించినట్లు నిర్ధారించారు. విచారణ చేసి వాల్టా చట్టం ప్రకారం నాలుగు లక్షల రూపాయల జరిమానా విధించారు. అలాగే తొలగించిన చెట్లకు బదులుగా మళ్లీ మొక్కలు నాటి, సంరక్షించాలనే నిబంధన కూడా అటవీ శాఖ అధికారులు పెట్టారు.
అధికారులను ప్రశంసించిన ఎంపి సంతోష్కుమార్
చెట్లు నరికిన రియల్ ఎస్టేట్ సంస్థకు భారీ జరిమాన విధించి తగు చర్యలు తీసుకున్న రెవిన్యూ, అటవీ శాఖ అధికారులను టిఆర్ఎస్ ఎంపి జోగినపల్లి సంతోష్కుమార్ ప్రశంసించారు. భవిష్యత్తులో చెట్లు నరకాలని భావించే వారికి ఈ చర్య ముందస్తూ హెచ్చరికగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఎవరికి వారు తమ ఇష్టానుసారంగా చెట్లును కొట్టివేస్తే…ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందో ఈ ఘటన తెలియజేస్తున్నదన్నారు. ప్రకృతి హాని కలిగించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.